నామాల లోకేశ్, బానోతు హేమంత్, అల్వియా షిఫాలీ
పాలిసెట్లో ఈసారీ అమ్మాయిలదే హవా
సెట్లో 82.92 శాతం పాస్
ఎంపీసీలో 82, ఎంబైపీసీలో 81 శాతం క్వాలిఫై
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి నిర్వహించిన టీజీ పాలిసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. శనివారం మాసబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి 82.94 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలురు 79.92 శాతం, బాలికలు 86.38 శాతం క్వాలిఫై అయ్యారు. బాలురతో పోల్చితే బాలికలు 6.46 శాతం అధికంగా ఉత్తీర్ణతను నమోదు చేశారు. ఎంపీసీ విభాగంలో 11 మంది స్టేట్ మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు.

ఒకే మార్కు మీద ఉండటంతో వీరికి మొదటి ర్యాంకును కేటాయించారు. గతంలో ఒకరిద్దరు..లేదా ముగ్గురు ఒకే మార్కును సాధించిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి ఏకంగా 11 మంది ఒకే ర్యాంకుపై ఉండటం గమనార్హం. అయితే వీరికి స్టేట్–1 ర్యాంకు కేటాయించినా తర్వాత సబ్జెక్టుల వారీగా వచి్చన మార్కులు, పుట్టిన తేదీ ఆధారంగా ఒకటి, రెండు, మూడు, ర్యాంకులను ఖరారు చేస్తారు. ఇక ఎంబైపీసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు స్టేట్ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. నాలుగో ర్యాంకుపై ఇద్దరు, ఆరో ర్యాంకుపై ముగ్గురు విద్యార్థులున్నారు.

ఈ ఏడాది 1,06,439 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,029 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 81,307 విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్ డిప్లొమాతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, కొండా లక్ష్మణ్ బాపూజీ హారి్టకల్చర్, పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. డిప్లొమా కోర్సుల సీట్ల భర్తీ షెడ్యూల్ ఇప్పటికే విడుదలయ్యింది. ఈ నెల 27 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.

నాన్న కష్టాన్ని చూసే లక్ష్యాన్ని ఎంచుకున్నా..
స్టేట్ ఫస్ట్ సాధించిన ఆటో డ్రైవర్ కుమారుడు
ఖిలా వరంగల్: వరంగల్ రుద్రమదేవి కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ నామాల రాజు, రజిత దంపతుల కుమారుడు నామాల లోకేశ్ పాలిసెట్ ఫలితాల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఎంపీసీ విభాగంలో 120/120 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాక్ సాధించాడు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లోనూ 568 మార్కులతో సత్తా చాటాడు. పాలిసెట్ ఎంబైపీసీలోనూ 120 మార్కులకుగాను 119 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ను కైవసం చేసుకున్నారు. కాగా, నాన్న ఆటోడ్రైవర్గా పడే కష్టాన్ని చూసి లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి చదువుకున్నానని, భవిష్యత్తులో ఎల్రక్టానిక్ ఇంజనీర్గా స్థిరపడాలనుకుంటున్నానని లోకేశ్ చెప్పాడు.


