Gandhi Hospital Security Staff Help To Boy - Sakshi
Sakshi News home page

ఐసీయూలో తల్లి .. ఆకలితో చిన్నారి

May 6 2023 10:53 AM | Updated on May 6 2023 3:50 PM

Gandhi Hospital security staff Help to Boy - Sakshi

(హైదరాబాద్, గాందీఆస్పత్రి): చావుబతుకుల మధ్య తల్లిప్రాణం కొట్టుకుంటుంది.. ఆరుబయట చిన్నారి ఆకలితో అల్లాడుతున్నాడు. నేనున్నాను అనే భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి తనకేమి పట్టనట్లు ఇద్దరినీ అలాగే వదిలేసి వెల్లిపోయాడు. ఆకలితో పాటు అమ్మకోసం ఏడుస్తున్న చిన్నారిని చేరదీసి, ఆకలి తీర్చి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న తల్లిని చూపించి మానవత్వం చాటుకున్నారు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది.

అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌ సలూరాకేంపు ప్రాంతానికి చెందిన గంగాధర్, మాధవి భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల బాబు సాతి్వక్‌ ఉన్నాడు. రెండవ కాన్పు కోసం ఈ నెల 1న మాధవి గాంధీ ఆస్పత్రిలో చేరింది. అదే రోజు ఆడశిశువు పుట్టిన వెంటనే చనిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయస్థితి చేరిన మాధవికి మెటరీ్నటీ ఇన్సెంటివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎంఐసీయూ) లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 

జాడలేని భర్త ఆచూకీ.. 
కారణం తెలియదు కానీ మాధవి భర్త గంగాధర్‌ ఈనెల 2వ తేదీన కుమారుడు సాతి్వక్‌ను గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో వదిలేసి వెల్లిపోయాడు. ఆకలితో అల్లాడుతూ అమ్మ కోసం రోధిస్తున్న చిన్నారిని గాంధీ సెక్యూరిటీ సిబ్బంది గమనించి అన్నం పెట్టి బుజ్జగించి ఆరా తీశారు. పలు వార్డులను తిప్పుగా వెంటిలేటర్‌పై అపస్మారకస్థితిలో ఉన్న అమ్మను చిన్నారి సాతి్వక్‌ గుర్తించాడు. కేస్‌ ట్‌లో ఉన్న గంగాధర్‌ సెల్‌ఫోన్‌ నంబరుకు కాల్‌ చేయగా స్విచ్చాఫ్‌ వస్తోంది. గాంధీ సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ శివాజీ నేతృత్వంలో సిబ్బంది ఆంజనేయులు, శ్రీకాంత్, నర్సింహా, కళ్యాణ్, నాగరాజు, శివకుమార్, వరలక్ష్మీ, లావణ్య, అనురాధలు గత మూడు రోజులుగా చిన్నారి సాతి్వక్‌ను షిఫ్ట్‌డ్యూటీ ప్రకారం వంతుల వారీగా చేరదీసి అన్నం పెట్టి ఆకలి తీర్చి అమ్మను మరిపిస్తున్నారు. 

ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న మాధవికి రోగి సహాయకులు లేకపోవడంతో  మెడికో లీగల్‌ కేసు (ఎంఎల్‌సీ)గా పరిగణించి వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. మాధవి కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు ఆధారంగా ఉన్న ఫోన్‌ నంబరు కాల్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వస్తోందన్నారు. చిన్నారిని చేరదీసి మానవత్వం చాటుకున్న సెక్యూరిటీ సిబ్బందిని గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు, జీడీఎక్స్‌ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధి రవికుమార్‌లతోపాటు పలువురు వైద్యులు, రోగి సహాయకులు అభినందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement