బాబు కాన్వాయ్‌కు ప్రమాదం | Chandrababu Naidu Convoy Met With An Accident At Choutuppal | Sakshi
Sakshi News home page

బాబు కాన్వాయ్‌కు ప్రమాదం

Sep 6 2020 4:18 AM | Updated on Sep 6 2020 4:18 AM

Chandrababu Naidu Convoy Met With An Accident At Choutuppal - Sakshi

దెబ్బతిన్న కాన్వాయ్‌లోని వాహనం

చౌటుప్పల్‌: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడు వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్తున్నారు. కాన్వాయ్‌లో ముందు మూడు, వెనుక మూడు వాహనాలు ఉండగా మధ్యలో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో చంద్రబాబు ఉన్నారు.

ఈ క్రమంలో దండుమల్కాపురం గ్రామం వద్దకు రాగానే.. ఓ ఆవు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చింది. వేగంగా వస్తున్న కాన్వాయ్‌లోని మొదటి వాహనం డ్రైవర్‌ ఆవును గమనించి సడన్‌ బ్రేక్‌ వేశాడు. ఆ వెంటనే రెండో వాహనం డ్రైవర్‌ సైతం బ్రేక్‌ వేశాడు. మూడో వాహనం ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. అదే సమయంలో ప్రమాదాన్ని పసిగట్టిన చంద్రబాబు కూర్చున్న వాహనం డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి తన వాహనాన్ని పక్కకు తప్పించాడు. దీంతో ప్రమాదం తప్పింది. ముందున్న వాహనాలు ఢీకొనడంతో కొద్ది నిమిషాల పాటు కాన్వాయ్‌ని సెక్యూరిటీ సిబ్బంది రోడ్డు పక్కన ఆపారు. దెబ్బతిన్న వాహనాన్ని అక్కడే వదిలి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లిపోయారు.
కారులో కూర్చొని ఉన్న చంద్రబాబు

Advertisement
 
Advertisement
Advertisement