నియంతలా సీఎం రేవంత్‌ | BRS Working President ktr fires on Revanth Reddy | Sakshi
Sakshi News home page

నియంతలా సీఎం రేవంత్‌

Sep 18 2025 4:20 AM | Updated on Sep 18 2025 4:20 AM

BRS Working President ktr fires on Revanth Reddy

కాళేశ్వరం డాక్యుమెంటరీని విడుదల చేస్తున్న కేటీఆర్‌. చిత్రంలో జగదీశ్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి తదితరులు

రాష్ట్రంలోని అన్నివర్గాలను ప్రభుత్వం వేధిస్తోంది 

సీఎం వేధింపుల వల్లే మెట్రో నుంచి ఎల్‌అండ్‌టీ నిష్కమణ 

త్వరలో ఎమ్మార్‌ ఆస్తులను అమ్మే ప్రయత్నాల్లో సీఎం 

జైపాల్‌ రెడ్డి కుటుంబ భూముల కోసమే ఫోర్త్‌ సిటీకి రోడ్డు 

రేవంత్‌ రెడ్డి ముమ్మాటికీ బీజేపీ మనిషి, ఎంపీలను అమ్మేశారు 

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శ

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విమర్శించారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలపై నిరంకుశత్వాన్ని చూపుతోందని మండిపడ్డారు. గ్రూప్‌ 1 అభ్యర్థులు, విద్యార్థులు కనీసం రౌండ్‌ టేబుల్‌సమావేశం నిర్వహించుకునే పరిస్థితి కూడా లేదని అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం కేటీఆర్‌ మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. 

‘సీఎం రేవంత్‌ బెదిరింపులు, ముడుపుల కోసం వేదింపులు తట్టుకోలేక హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు నుంచి ఎల్‌ అండ్‌ టీ సంస్థ వైదొలుగుతోంది. గతంలో ఎల్‌అండ్‌టీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ను జైల్లో పెడతానని బెదిరించారు. గతంలో వివాదాస్పదమైన ఎమ్మార్‌ సంస్థ ఆస్తులను కూడా కమీషన్ల కోసం రేవంత్‌రెడ్డి త్వరలో అమ్మబోతున్నారు. పలు కంపెనీలపై గతంలో ఉన్న కేసులను అడ్డుపెట్టుకుని రేవంత్‌రెడ్డి సెటిల్‌మెంట్లు చేసుకోవడంతోపాటు కంపెనీల నుంచి ముడుపులు తీసుకుంటున్నారు’అని కేటీఆర్‌ ఆరోపించారు. 

జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యుల కోసమే.. 
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన రీజినల్‌ రింగు రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) అలైన్‌మెంట్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇష్టారీతిన మార్చుతుండటంతో వేలాది మంది రైతులు భూములు కోల్పోతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ఫోర్త్‌ సిటీ దగ్గర ఉన్న తమ భూముల కోసం అలైన్‌మెంట్, ట్రిపుల్‌ ఆర్‌ స్వరూపాన్ని మార్చేశారని ఆరోపించారు. ‘ట్రిపుల్‌ ఆర్‌కు, ఫోర్త్‌ సిటీకి మధ్యలో వేస్తున్న రోడ్డు కేవలం రేవంత్‌ రెడ్డి, జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యుల భూముల కోసమే. 

ఈ రోడ్డు వెంబడి అనేక మంది నుంచి భూములు కొనుగోలు చేసి ఇప్పటికే రేవంత్‌ కుటుంబం ఒప్పందాలు చేసుకుంది. ఆయన హైదరాబాద్‌లోని భూములన్నింటినీ అమ్ముతున్నారు. రాష్ట్రంలో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ దొరికినా సీఎం, ఈగల్‌ టీమ్‌కు సమాచారం లేదు. హైడ్రా మంచి ఫలితాలు ఇస్తే వర్షం వచి్చనప్పుడు హైదరాబాద్‌ నగరం ఎందుకు మునిగిపోతోంది’అని కేటీఆర్‌ ప్రశ్నించారు.  

ఎంపీలను అమ్మేసిన రేవంత్‌..: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలను రేవంత్‌రెడ్డి గొర్రెల్లా అమ్మేశారని కేటీఆర్‌ ఆరోపించారు. ఆయన ముమ్మాటికీ బీజేపీ మనిషే అని అన్నారు. ‘రాష్ట్రంలో అద్భుత పాలన ఉంటే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి వెంటనే ఉప ఎన్నికలు పెట్టాలి. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేనంత బలహీనంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. 

బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్‌ మాట మార్చి రాహుల్‌ గాంధీకి ప్రధాన మంత్రి పదవితో ముడిపెడుతున్నాడు. తీన్మార్‌ మల్లన్నతో సహా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది. గ్రూప్‌ 1 ఉద్యోగాలు రూ.3 కోట్ల చొప్పున అమ్ముకున్నారని అభ్యర్థులే చెప్తున్నారు. గ్రూప్‌ 1 పరీక్షలో అవినీతిపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? యువతతో పెట్టుకుంటున్న రేవంత్‌ రెడ్డికి పతనం తప్పదు’అని కేటీఆర్‌ హెచ్చరించారు. 

కాళేశ్వరంపై బీజేపీ, కాంగ్రెస్‌ రాజకీయం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ కలిసికట్టుగా చిల్లర రాజకీయం చేస్తున్నాయని కేటీఆర్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నేత ఏనుగు రాకేశ్‌రెడ్డి రూపొందించిన కాళేశ్వరం డాక్యుమెంటరీని తెలంగాణ భవన్‌లో బుధవారం కేటీఆర్‌ విడుదల చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపు ఎలా సాధ్యమని అసెంబ్లీలో ప్రశ్నిస్తే సర్కారు వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు. ట్రిపుల్‌ ఆర్‌లో భూములు కోల్పోతున్న వికారాబాద్‌ జిల్లా రైతులు బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి సమస్యలు విన్నవించారు. వారికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement