
హైదరాబాద్: బీఐఎస్ ధ్రువీకరించిన ఐఎస్ఐ మార్కు లేని ఉత్పత్తులను నిల్వ చేశారన్న సమాచారంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు సికింద్రాబాద్ సీటీసీ కాంప్లెక్స్లోని గోదాంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బీఐఎస్ ధ్రువీకరణ పొందని గృహోపకరణాలు గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ ఆదేశాలతో బీఐఎస్ హైదరాబాద్ శాఖ డైరెక్టర్ రాకేశ్ తన్నీరు, డిప్యూటీ డైరెక్టర్ కెవిన్, ఎస్పీవో అభిసాయి ఇట్ట, ఎస్ఎస్ఏ శివాజీ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
సికింద్రాబాద్ సీటీసీ కాంప్లెక్స్లో ఉన్న ఓ గోదాంలో మంగళవారం బీఐఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపు రూ.8 లక్షల పైగా విలువైన 225 ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీకరణ లేదని గుర్తించినట్లు తెలిపారు. ఐఎస్ఐ మార్క్ లేని, నకిలీ ఐఎస్ఐ ముద్ర ఉన్న ఉత్పత్తులను జప్తు చేసినట్లు వెల్లడించారు. వీటిలో మిక్సర్లు, ప్రెజర్ కుక్కర్లు, సీలింగ్ ఫ్యాన్లు, హీట్ ప్లేట్లు, ఇస్త్రీ పెట్టెలు తదితర వస్తువులను జప్తు చేసి కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

బీఐఎస్ చట్టం 2016లోని పలు సెక్షన్ 17 ప్రకారం భారత ప్రభుత్వం బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసిన ఉత్పత్తులేవీ ఐఎస్ఐ మార్కు, ఎలక్ట్రానిక్ వస్తువులకు రిజిస్ట్రేషన్ మార్కు లేకుండా, బీఐఎస్ అనుమతి పొందకుండా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.