సాక్షి, హైదరాబాద్ : కూతురు పుట్టిందని సంతోషం ఆ కుటుంబానికి ఎక్కువ కాలం నిలవలేదు. పసికందుకు పట్టుమని నాలుగు నెలలు నిండకుండానే భయంకరమైన వ్యాధి సోకింది. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చూపించగా పాప బతకాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం పడుతుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల్లో గుండెల్లో ఒక్కసారిగా పిడుగు పడినట్లైంది. బతుకుదెరువుకోసం ఆటో నడిపించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తమకు రూ.కోట్లు చెల్లించి వైద్యం చేయించడం సాధ్యం కాదని, దాతల సాయం కోరుతున్నారు.
వనపర్తి జిల్లా మదనాపురం మండలం నెల్విడికి చెందిన బేరి రమేష్ స్థానికంగా ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మొదటి కుమార్తె చైత్రికకు స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్–1 అనే జన్యుపరమైన నరాల జబ్బు సోకిందని వైద్యులు గుర్తించారు. ఫలితంగా కండరాలు పూర్తిగా బలహీనపడి, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. పాపను ప్రాణాపాయం నుంచి కాపాడాలంటే రెండేళ్ల వయసు లోపు ఒనాసెమ్మోజీన్ అబెపార్వోవెక్ అనే ఇంజక్షన్ తీసుకోవాలని నిమ్స్ వైద్యులు సైతం సూచించారు.
అయితే దీని ఖరీదు సుమారు రూ.16 కోట్లు ఉండటంతో రమేష్ కుటుంబం పాపను బతికించుకోవడం కోసం తల్లడిల్లుతోంది. పెద్దమనసుతో ముందుకొచ్చి పాపను ఆదుకోవడానికి సాయం చేయాలని రమేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాతలు 8985801524, 9553267573 నెంబర్లను సంప్రదించాలని వారు కోరారు.


