యాదాద్రి పైకి ఆటోలు | Autos allowed at Yadadri temple after two years | Sakshi
Sakshi News home page

యాదాద్రి పైకి ఆటోలు

Feb 12 2024 4:22 AM | Updated on Feb 12 2024 4:28 PM

Autos allowed at Yadadri temple after two years - Sakshi

కలెక్టర్, డీసీపీలను ఎక్కించుకొని ఆటో నడిపిస్తున్న విప్‌ బీర్ల ఐలయ్య.

యాదగిరిగుట్ట : రెండేళ్ల తర్వాత యాదాద్రి కొండపైకి ఆటోల రాకపోకలు షురూ అయ్యాయి. యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన జరిగిన 2022 మార్చి 28వ తేదీ నుంచి కొండపైకి ఆటోలు నడపడం నిషేధించారు. దీంతో ఆటోడ్రైవర్లు నిరసనకు దిగారు. మొదటి ఘాట్‌ రోడ్డులోని యాదరుషి ఆలయం వద్ద వివిధ రూపాల్లో వారు దీక్షలు, ఆందోళనలు చేపట్టారు.

అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ రావడంతో పోలీసుల సూచన మేరకు నవంబర్‌ 2023లో దీక్షలు విరమించారు. అధికారంలోకి వస్తే గుట్టపైకి ఆటోలు నడిచేలా చూస్తామని కాంగ్రెస్‌ అభ్యర్థి బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చా క రెండు, మూడుసార్లు ఆటో డ్రైవర్లు, దేవాలయ, పోలీసు అధికారులతో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య చర్చలు జరిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖలతో మాట్లాడి ఆదివారం నుంచి కొండపైకి ఆటోలు నడిచే విధంగా చూశారు.  

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా  
ఆటోడ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ హనుమంతు కె.జెండగే, డీసీపీ రాజేష్‌ చంద్ర, ఈఓ రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తిలతో కలిసి జెండా ఊపి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లకు మంచి రోజులు వచ్చాయన్నారు. అనంతరం కలెక్టర్‌ జెండగే, డీసీసీ రాజేష్‌ చంద్రా, ఈఓ రామకృష్ణారావులను బీర్ల ఐలయ్య ఆటోలో గుట్టపైకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఏసీపీ శివరాంరెడ్డి, సీఐ రమే‹Ù, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధ తదితరులు పాల్గొన్నారు. 

ఆటోలకు స్టిక్కర్లు.. 
యాదాద్రి కొండపైకి నడిచే ఆటోలకు ట్రాఫిక్‌ పోలీసులు, ఆటో కారి్మక యూనియన్‌ నేతలు సీరియల్‌ నంబర్, శ్రీస్వామి వారి చిత్రపటంతో కూడిన స్టిక్కర్లు అతింకించారు. ఆటో డ్రైవర్ల డ్రైవింగ్‌ లైస్సెన్స్, పొల్యూషన్‌ పత్రాలను పరిశీలించారు. తొలి రోజు అధికారులు చెప్పిన ప్రకారం 100 ఆటోలను కొండపైకి నడిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement