సాక్షి, చైన్నె: వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలు (ఈ–చలాన్లు) చెల్లింపును గుర్తుచేసేందుకు చైన్నె ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా చైన్నె నగరవ్యాప్తంగా 15 ప్రదేశాలలో తాత్కాలిక కాల్సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కాల్సెంటర్లు ఈనెల 21 నుండి 30 వరకు పని చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వివరాలు.. చైన్నె నగరంలో ప్రస్తుతం చాలా మంది వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కెమెరాలు, అత్యాధునిక వ్యవస్థ ద్వారా ఆటోమేటిక్గా ఈ–చలాన్లు జారీ అవుతున్నాయి. అయితే ఈ విషయం చాలా మందికి తెలియకపోవడంతో పాటు, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పంపే లింక్లను సైబర్ నేరగాళ్ల మోసాలుగా భావించి ప్రజలు క్లిక్ చేయడానికి వెనుకాడుతున్నారు. ఈ అపోహలను తొలగించేందుకే ఈ ప్రత్యేక కాల్సెంట్లను ఏర్పాటు చేస్తున్నారు.
కాల్ సెంటర్లు:
పెద్ద ఎత్తున ఈ చలాన్లు పేరుకు పోయి ఉన్నాయి. ఈ జరిమాన చెల్లించేందుకు జనం ముందుకు రావడం లేదు. ఈ మొత్తాన్ని ఎక్కడ చెల్లించాలోతెలియని పరిస్థితి దీంతో తూర్పు జోన్ పరిధిలోని అయనవరం, రాయపేట, అభిరామపురం పోలీస్ స్టేషన్లు , రాయపేట క్లాక్ టవర్ పోలీస్ అసిస్టెన్స్ సెంటర్, పశ్చిమ జోన్ పరిధిలోని అన్నానగర్ రౌంటానా ట్రాఫిక్ పోలీస్ సహాయక కేంద్రం, అన్నా బెండ్ ట్రాఫిక్ పోలీస్ సహాయక కేంద్రం, మధురవాయిల్ పోలీస్ స్టేషన్, మాధవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో కాల్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించారు. అలాగే, ఉత్తర జోన్ పరిధిలోని తండయార్పేట, పుదుపేట, సెంబియం పోలీస్ స్టేషన్లు, దక్షిణ జోన్ పరిధిలోని మాంబళం పోలీస్ స్టేషన్, అడయార్ పోలీస్ స్టేషన్, గిండి కతిపారా ఫ్లైఓవర్ కింద, వేపేరిలోని చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనరేట్లో ఈసెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కాల్సెంటర్లు ఈనెల 21 నుండి 30వ తేదీ వరకు రోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పనిచేస్తాయని ప్రకటించారు. ఈ కేంద్రాల ద్వారా వాహనదారులను ఫోన్ ద్వారా సంప్రదించి వారి పెండింగ్ ఈ–చలాన్ల వివరాలను తెలియజేస్తారు. అలాగే ఎస్ఎంఎస్ ద్వారా కూడా భారీ ఎత్తున సమాచారం పంపుతారు.
జరిమానా చెల్లించే విధానం ఇలా..
వాహనదారులు తమ బకాయి ఉన్న జరిమానాలను అధికారిక వెబ్సైట్, నెక్ట్స్ జెన్ ఇ–చలాన్, పేటీఎం యాప్, పోస్టాఫీసులు, ఇ–సేవా కేంద్రాలు లేదా కోర్టుల ద్వారా చెల్లించవచ్చు అని సూచించారు. వారం రోజుల్లోగా జరిమానాలు చెల్లించాలని కోరిన పోలీసులు.. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా రద్దు చేసే చర్యలుంటాయని హెచ్చరించారు.


