సాక్షి, చైన్నె : చైన్నెలో అతిపెద్ద క్లెఫ్ట్ (పెదవి చీలిక– గ్రహణం మొర్రి) సంరక్షణ సంస్థ స్మైల్ ట్రైన్, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ – డాక్టర్ రెలా మెడికల్ సెంటర్ సంయుక్తంగా అతిపెద్ద అత్యంత సమగ్రమైన సమగ్ర క్లెఫ్ట్ కేర్ రిఫరెన్స్ సెంటర్ ఏర్పాటు చేశాయి. ఈ కేంద్రానికి సంబంధించిన బోర్డును స్మైల్ ట్రైన్ ప్రెసిడెంట్ సుసన్నా షేఫర్ , శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ చైర్పర్సన్ డాక్టర్ జె. శ్రీనిష, రెలా చైర్మన్ మహ్మద్ రెలాలు గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్మైల్ ట్రైన్ ఆసియా రీజినల్ డైరెక్టర్ మమతా కారోల్, క్లెఫ్ట్ అండ్ క్రానియోఫేషియల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినప్పటి నుండి ఎదుగుదల పూర్తయ్యే వరకు క్లెఫ్ట్ సమస్య ఉన్న పిల్లలకు ప్లాస్టిక్, మాక్సిల్లోఫేషియల్, ఈఎన్టీ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోడాంటిక్స్, స్పీచ్ అండ్ హియరింగ్, న్యూట్రిషన్ మరియు క్లినికల్ సైకాలజీ వంటి అన్ని విభాగాల నిపుణుల ఆధ్వర్యంలో సమగ్ర వైద్యం అందించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సమగ్ర వైద్యం అందించడంలో ఇదొక మైలురాయి అని, సామాజిక–ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ వైద్యం అందేలా తమ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఈసందర్భంగా మహ్మద్ రెలా ప్రకటించారు.


