సాక్షి, చైన్నె: తమిళనాడులో డెంగీ తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రధానంగా చైన్నె, కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్, సేలం ,కృష్ణగిరి జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదుకాగా రోజూ సుమారు 100 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అలాగే, వైరల్ ఫీవర్ సైతం స్వైర విహారం చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు క్లీనిక్ల వద్ద జ్వరాలలో క్యూ కట్టే వారి సంఖ్య పెరిగింది. వైరల్ ఫీవర్ కాస్త డెంగీ కి పరిస్థితులు దారి తీస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
నివారణ చర్యలు
డెంగీ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. అన్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయడంతో పాటు సరిపడా మందుల నిల్వలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖ డైరెక్టర్ సోమసుందరం వెల్లడించిన వివరాల ప్రకారం.. డెంగీని వ్యాప్తి చేసే ఏడిస్ దోమలను, వాటి లార్వాలను గుర్తించి నిర్మూలించడానికి రాష్ట్రవ్యాప్తంగా 25,158 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. దోమల నిర్మూలన పనులతో పాటు, జ్వరం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.రాష్ట్రంలోని 45 ఆరోగ్య జిల్లాల పరిధిని పర్యవేక్షించడానికి 12 మంది ప్రత్యేక కోఆర్డినేటర్లను నియమించారు. ఒక్కో కోఆర్డినేటర్ స్థానిక ప్రభుత్వ సంస్థలు, వైద్య విభాగాల సహకారంతో సగటున 3 నుండి 4 ఆరోగ్య జిల్లాల్లో డెంగ్యూ నివారణ పనులను పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. అలాగే తీవ్రత అధికంగా ఉన్న జిల్లాలో ప్రత్యేకంగా ఐఎఎస్ అధికారులను పర్యవేక్షణకు రంగంలోకి దించారు. కాగా, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం డెంగీ స్వైర వివాహరం చేస్తున్నట్టు అమ్మమక్కల్మున్నేట్ర కళగం నేత దినకరన్ ఆరోపించారు. 16 వేల మంది డెంగీ బారీన పడి ఉన్నారని, తొమ్మిది మంది మరణించినట్టు సమాచారాలు రావడం బట్టి చూస్తే, ప్రజల ఆరోగ్యంపై ఈ పాలకుకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోందని విమర్శించారు.


