వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాలకు పందకాల పూజలు గురువారం ఉదయం శివాచార్యుల వేద మంత్రాల నడుమ వైభవంగా ప్రారంభించారు. ప్రతి సంవత్సరం అరుణాచలేశ్వరాలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు జరిగి ఆఖరి రోజు ఆలయం వెనుక వైపున ఉన్న శివుడిగా భావించే మహా కొండపై సాయంత్రం 6 గంటలకు మహా దీపాన్ని వెలిగించడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తుంది. ఈ దీపోత్సవాలను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షల మంది భక్తులు పాల్గొని దీపాన్ని దర్శించుకోనున్నారు. ఈ సంవత్సరం కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 12వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమై 28వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ కార్తీక బ్రహ్మోత్సవాలకు గాను ఆలయంలో పలు అలంకరణలతో పాటు ఆలయ ప్రాంగంణంలో పందిళ్లు వేయనున్నారు. ఇందుకోసం ఉదయం 4.30 గంటలకు శివాచార్యుల వేద మంత్రాల నడుమ భక్తులు ఆలయంలోని మూడవ ప్రాకారంలోని సంపత్ వినాయకుడి సన్నిధిలో పందకాలను ఉంచి ప్రత్యేక పూజలు, అభిషేక ఆరాధన పూజలు జరిపారు. అక్కడ నుంచి వేద మంత్రాల నడుమ శివాచార్యులు భక్తులు పందకాలను హరోం.....హరా.... నామ స్మరణాల మద్య రాజగోపురం ఎదుటకు తీసుకొచ్చి రథం వీధిలో నిలిచి ఉంచిన రధానికి ప్రత్యేక పూజలు చేసి రదం వీధిలో పందకాలను నాటారు. కలెక్టర్ వందన కార్క్, ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్, ఎమ్మెల్యే అభిషేక్, టీవీకే జిల్లా కార్యదర్శి భారతిదాసన్, భక్తులు పాల్గొన్నారు.


