●ప్రభుత్వ ఉద్యోగి సహా ఇద్దరి అరెస్టు
కొరుక్కుపేట : చైన్నెలోని సెయింట్ థామస్ మౌంట్ బజార్లో ఉన్న ఒక రెస్టారెంట్కు ఇద్దరు యువకులు వచ్చి ఆహారం అడిగారు. అక్కడున్న సిబ్బంది అన్నీ అయిపోయాయని, భోజనం చేసే సమయం అయిందని , ఏమీ లేదని వారు చెప్పారు. మత్తులో ఉన్న యువకులు, ఉద్యోగులతో వాదనకు దిగారు. వాదన ముదిరిన కొద్దీ, ఆగ్రహించిన యువకులు హోటల్ సిబ్బందిపై దాడి చేయడం ప్రారంభించారు. ఇందులో ఒడిశా రాష్ట్రంకు చెందిన జాస్మీర్ (34) అనే ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. యువకులు ఫ్రిజ్ను, వంటసామాగ్రిని పగలగొట్టి, మసాలాలు విసిరి అల్లరి మొదలుపెట్టారు. ఉద్యోగి సెల్ ఫోన్ కూడా పగిలిపోయింది. పోలీసుల దర్యాప్తులో నిందితులు అలందూర్లోని మాధవ పెరుమాళ్ వీధికి చెందిన కిషోర్ అలియాస్ కృష్ణన్ (27) , అతని స్నేహితుడు గోకులకృష్ణన్ (27) అని వెల్లడైంది. కిషోర్ తమిళనాడు ప్రధాన కార్యాలయంలోని ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా, గోకులకృష్ణన్ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిసింది. అనంతరం పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు.
మెట్రో స్టేషన్లలో మోటార్
పంపు సెట్లు సిద్ధం
కొరుక్కుపేట:చైన్నెలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, చైన్నె మెట్రో రైల్ కార్పొరేషన్, మెట్రోపాలిటన్ చైన్నె హైవేస్ డిపార్ట్మెంట్తో కలిసి వివిధ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. వర్షాకాలంలో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, తగినంత సామర్థ్యం గల డ్రైనేజీ పంపులను ఏర్పాటు చేశారు. మిల్లాస్ రోడ్, స్టెర్లింగ్ రోడ్, ఆండర్సన్ రోడ్, ఆర్కేడ్ రోడ్ పోరూర్ జంక్షన్, శాస్త్రి నగర్, విల్లివాక్కం, పెరంబూర్ యగర్ ట్యాంక్ లింక్ రోడ్, మౌంట్ పూనమల్లి రోడ్, ఇందిరా నగర్ తదితర ప్రాంతాల్లో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా, ఓకియం మదువులిల్ ప్రాంతంలోని 98 మీటర్ల పొడవైన భాగాన్ని పూర్తిగా పూడిక తీసి, మరమ్మతులు చేశారు. దీనివల్ల వర్షపు నీరు నిరాటంకంగా ప్రవహించడానికి ఒక కాలువ ఏర్పడింది. వరదల సంభావ్యతను తగ్గించడానికి ఈ చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద, వర్షాకాలంలో వరదలను నివారించడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ, చైన్నె మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ మూడు లైన్లలోనూ వేగంగా పురోగమిస్తోందని మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ రమణనాథన్ గురువారం మీడియాకు తెలిపారు.
ఘనంగా ఆలయ మహాకుంభాభిషేకం
పళ్ళిపట్టు: పాండ్రవేడు గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయ మహాకుంభాభిషేకం వేడుకలు గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పళ్లిపట్టు యూనియన్లోని పాండ్రవేడు దళితవాడలో వేంకటేశ్వస్వామి, వేణుగోపాలస్వామి, శ్రీ రాముడి ఆలయం నూతనంగా నిర్మించారు. గురువారం ఉదయం మహా కుంభాభిషేకం వేడుకలు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో యాగశాల ఏర్పాటు చేసి నిత్య హోమగుండ పూజలు చేపట్టి మహాపూర్ణాహుతి హోమం నిర్వహించారు. అనంతరం మేళ తాళాలు నడుమ పవిత్ర పుణ్యతీర్ధాల కలశాలతో బయల్దేరి గ్రామీణుల నడుమ ఆలయ గోపుర కలశం వద్ద శ్రీ రాముడి విగ్రహానికి మహాకుంభాభిషేకం చేపట్టారు. అదే సమయంలో ఆలయంలో ప్రతిష్టించిన వేంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి, శ్రీరాముడి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేడుకల్లో మాజీ జిల్లా కౌన్సిలర్ శ్రీనివాసన్, మాజీ యూనియన్ చైర్మన్ శాంతిప్రియాసురేష్, పంచాయతీ మాజీ సర్పంచ్ ఆమావాస్య పాల్గొన్నారు.


