తిరువొత్తియూరు: సాఫ్ట్వేర్ ఇంజినీర్పై దాడి చేసి ఐఫోన్, ల్యాప్టాప్ దోచుకెళ్లిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ వడపళనిలోని ఒక హాస్టల్లో ఉంటూ, పుదుపేటలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన అరుంబాక్కం సమీపంలోని 100 అడుగుల రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, మోటార్ సైకిల్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. ఆయన వద్ద ఉన్న బ్యాగ్, ల్యాప్టాప్, ఐఫోన్ సహా రెండు ఖరీదైన సెల్ఫోన్లను లాక్కుని పారిపోయారు. కోయంబేడు బస్టాండ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సోమవా రం రాత్రి ప్రత్యేక పోలీసు బృందం మాంగాడు ప్రాంతానికి చెందిన పేరుమోసిన దొంగ విఘ్నేష్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన విఘ్నేష్పై ఇప్పటికే పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో మరొకరు కళాశాల విద్యార్థి అని తెలిసింది.
రూ.97.73 కోట్లతో
అభివృద్ధి పనులు
కొరుక్కుపేట: రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి , ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి కీలక చర్యలో తీసుకున్నారు. ఇందులోభాగంగా, దక్షిణ రైల్వేకు చెందిన చైన్నె డివిజన్ అరక్కోణం స్టేషన్యార్డ్లో రూ.97.73 కోట్ల విలువైన విస్తృతమైన ఆధునీకరణ పనులను చేపడుతోంది. అరక్కోణం జంక్షన్ దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే సబర్బన్ రైల్ నెట్వర్క్లలో కూడా ఒకటి. దీనికి పెరుగుతున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, సుదూర ఎక్స్ప్రెస్, సబర్బన్ రైళ్లు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా నడిచేలా చూడడానికి చైన్నె డివిజన్ ఈ భారీ ప్రాజెక్ట్ను చేపట్టింది. ఎక్స్ప్రెస్, సబర్బన్ రైలు సర్వీసుల కోసం ట్రాక్లను వేరు చేయడం ఈ ప్రాజెక్ట్లోని ముఖ్యమైన అంశం. ప్రస్తుతం, ఈ రెండు సర్వీసులు ఒకే రైల్వే ట్రాక్లోని కొన్ని భాగాలను పంచుకుంటున్నాయి. దీనివల్ల కార్యకలాపాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అభివృద్ధి కొత్త, ప్రత్యేకమైన మార్గాలు రైళ్లు ఏకకాలంలో కదలడానికి వీలు కల్పిస్తాయి. దీనివల్ల రైళ్ల సమయపాలన గణనీయంగా మెరుగుపడి, ప్రయాణికుల నిరీక్షణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు.


