తిరువళ్లూరు: తిరువళ్లూరు సమీప ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదైంది. బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు కూలడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తిరువళ్లూరులో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు వరకు ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అనంతరం నల్లటి మేఘాలు కమ్ముకుని గంటపాటు ఈదురుగాలులు వీచాయి. వీచింది. గాలులకు తిరుప్పాచ్చూర్, కడంబత్తూరు, పేరంబాక్కం, సత్తరై ప్రాంతాల్లో ఏడు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో కడంబత్తూరు పేరంబాక్కం సమీపంలోని పదికి పైగా గ్రామాలకు విద్యుత్ను నిలిపివేశారు. మామిడి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఇటుక బట్టీలకు సైతం నష్టం వాటిల్లింది.


