ఆపరేషన్‌ ఆకర్ష్‌ అసలు లక్ష్యం ఇదేనా? | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ఆకర్ష్‌ అసలు లక్ష్యం ఇదేనా?

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మెరుపు దాడి రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరడం రాష్ట్రవ్యాప్తంగా పెను తుఫానును రేపింది. ఈ పరిణామం డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే కాకుండా.. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌, వీసీకే, లెఫ్ట్‌ పార్టీలు సైతం ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి.

కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్‌ బీ?

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించినప్పటికీ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ (118) ను టీవీకే సాధించలేకపోయింది. ఈ సమయంలో కాంగ్రెస్‌, వీసీకే, ఐయూఎంఎల్‌, లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఇవ్వడంతో విజయ్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. లెఫ్ట్‌ పార్టీలు మినహా మిగిలిన భాగస్వామ్య పక్షాలకు మంత్రివర్గంలోనూ చోటు కల్పించారు. అయితే ఐదేళ్ల పాటు కూటమి పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ప్రభుత్వాన్ని నడపాల్సి రావడం సీఎం విజయ్‌కు కొంత అసంతృప్తిని కలిగించినట్టు సమాచారం. దీంతో ఆయన ’ప్లాన్‌ బి’ని తెరపైకి తెచ్చారన్న చర్చ ఊపందుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఫిరాయింపుల నిరోధక చట్టం అస్త్రంతో రాజీనామా ద్వారా తన వైపుకు తిప్పుకునే వ్యూహాలకు పదును పెట్టినట్టు చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం కూటమి మద్దతుతో ప్రభుత్వం సురక్షితంగా ఉన్నప్పటికీ, విజయ్‌ ఎందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారనే ప్రశ్న మిత్రపక్షాల్లో తాజాగా మొదలైంది. ఉపఎన్నికల్లో టీవీకే ను గెలిపించుకుని క్రమంగా బలాన్ని పుంజుకునే దిశగా విజయ్‌ వ్యూహాలకు పదును పెట్టినట్టుగా చర్చ ఊపందుకోవడం గమనార్హం. మరి కొందరికి సైతం వల వేసినట్టు, తాజాగా ఐదు స్థానాలు ఖాళీగా ఉండటంతో ఉప ఎన్నికలలో వీటిని చేజిక్కించుకున్న పక్షంలో ఆ తదుపరి మరి కొందర్ని తమ వైపునకు తిప్పుకునే వ్యూహంతో విజయ్‌ ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement