పళ్లిపట్టు: స్థానిక బస్టాండులో టాస్మాక్ దుకాణం తొలగించాలనే డిమాండ్తో ఆదివారం టాస్మాక్ ముట్టడికి ప్రయత్నించిన స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి విజయ్ అధికారం చేపట్టిన తరువాత బస్టాండ్లు, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు 500 మీటర్ల దూరంలోని 717 టాస్మాక్ దుకాణాలు మూసివేయాలని సీఎం విజయ్ ఆదేశించారు. దీంతో పళ్లిపట్టు బస్టాండులో వున్న టాస్మాక్ దుకాణం మూసివేస్తారని స్థానికులు ఎదురుచూశారు. అయితే టాస్మాక్ దుకాణం మూసివేసేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవంతో ఆగ్రహం చెందిన స్థానికులు ఆదివారం దుకాణాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఐ కార్తీక్ స్థానికులతో చర్చించి టాస్మాక్ తొలగింపునకు సంబంధించి ఫిర్యాదు చేస్తే సంబంధింత అధికారులకు సమాచారం ఇచ్చి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో టాస్మాక్ దుకాణం తెరిచి సిబ్బంది వ్యాపారం నిర్వహించారు.


