–కాంగ్రెస్ ఎంపీ శశికాంత్సెంథిల్
తిరువళ్లూరు: కేంఽద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు రానున్న మూడేళ్లు ప్రధానమని, కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా పని చేసి కాంగ్రెస్ విజయానికి కృషిచేయాలని తిరువళ్లూరు ఎంపీ శశికాంత్ సెంథిల్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నేతలతో ప్రత్యేక సమావేశం శనివారం ఉదయం జరిగింది. డీసీసీ అధ్యక్షుడు శశికుమార్, కాంగైకుమార్ ఆవడి కార్పొరేషన్ పార్టీ అధ్యక్షుడు అమిత్బాబు అధ్యక్షత వహించగా మాజీ డీసీసీ అధ్యక్షుడు పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు చిదంబరం ప్రసంగించారు. ఎంపీ శశికాంత్ సెంథిల్ హాజరై ప్రసంగిస్తూ మూడేళ్లు కాంగ్రెస్ శ్రేణులకు క్లిషమైందన్నారు. ఈ మూడేళ్లు కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా పనిచేస్తే రాహుల్గాంధీని ప్రధానిని చేయొచ్చన్నారు. అనంతరం మీడియాతో ఎంపీ మాట్లాడుతూ దేశంలోని పౌరులకు పొదుపు పేరిట హితబోధ చేసి ప్రధాని మాత్రం ప్రత్యేక విమానాల్లో విదేశీయాత్రలు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లోనూ వెనుకుబాటుతనం కనిపిస్తోందన్నారు. నీట్ పరీక్షలను తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించినా మోదీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడే ప్రమాదం వుందని విమర్శించారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్, మైనారిటీ సంక్షేమ శాఖ విభాగం జిల్లా అధ్యక్షుడు ఖలీల్ రెహ్మాన్, పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదనరావు, సతీష్ పాల్గొన్నారు.


