– వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా నిర్ణయం
సాక్షి,చైన్నె: కాంక్రీట్ ఆధారిత అంతర్జాతీయ ప్రదర్శన వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా–2026, 12వ ఎడిషన్ నేపథ్యంలో, చైన్నెలో కీలకమైన పరిశ్రమల ప్రతినిధులు, మీడియా రౌండ్ టేబుల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. జూన్ 3 నుంచి 5 వరకు ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్న ప్రధాన ప్రదర్శనకు ముందు దక్షిణాది మార్కెట్ను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా కార్యక్రమం జరిగింది. నిర్మాణ రంగం వృద్ధి లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమ నిపుణులు, అగ్రగామి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. చైన్నె, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ రంగ విస్తరణ, పారిశ్రామిక వృద్ధి, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా దక్షిణాదిలో కాంక్రీట్, నిర్మాణ సామగ్రికి డిమాండ్ భారీగా పెరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. నిర్మాణ రంగం 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. సమావేశంలో ఇన్ఫార్మా మార్కెట్స్ ఇండియా సీనియర్ గ్రూప్ డైరెక్టర్ రజనీష్ ఖట్టర్తోపాటు టీ. అశోకన్ (ఫ్లోరింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్), మోహన్ రామనాథన్ (ఇండియన్ డెమోలిషన్ అసోసియేషన్), మురళీధరన్ ఎన్.జి (ఐసీఐ చైన్నె సెంటర్), అపూర్వ అశోక్ కాటే (దురాక్లీన్) పాల్గొన్నారు.


