తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ పుష్కరిణి కాలుష్యంతో నిండి దుర్వాసన వెదజెల్లుతోంది. భక్తులు బకెట్ నీటిని కొని స్నానం చేసి స్వామి దర్శనానికి వెళుతున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. చాలా మంది భక్తులు తల నీలాలు సమర్పించి ఆలయ శరవణ పొయ్గై పుష్కరిణిలో స్నానం ఆచరించి దర్శనానికి వెళుతుంటారు. భక్తులు తమ మొక్కులు చెల్లించే విధంగా పుష్కరిణిలో పుష్పాలు, బెల్లం సహా పూజా సామగ్రి వస్తువులు వేస్తుంటారు. స్థానికులు దుస్తులు సైతం ఉతుకుతుంటారు. వర్షాకాలంలో వర్షపు నీటితో పాటు మురుగునీరు సైతం పుష్కరిణిలో నిండడంతో నీరు కాలుష్యంగా మారి దుర్వాసన వెదజెల్లుతోంది. దీంతో ఆ నీటిలో స్నానం చేసేందుకు భక్తులు మొహం చాటేస్తున్నారు. పుష్కరిణిలో మురుగునీరు చేరకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని, పుష్కరిణి నిత్యం పరిశుభ్రం చేసి స్వచ్ఛంగా వుంచాలని భక్తులు కోరుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈక్రమంలో భక్తులు తలనీలాలు సమర్పించి బకెట్ నీటిని రూ. పదికి కొనుగోలు చేసి అరకొరగా స్నానం చేస్తున్నారు. ఆలయ అధికారులు స్పందించి పుష్కరిణి కాలుష్యం కాకుండా పరిశుభ్రంగా వుంచి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు.


