● బాధ్యతల స్వీకరణ
సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వ నూతన అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది విజయ్ నారాయణ్ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో రాజకీయ మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ కీలక నియామకం జరిగింది. వివరా లు.. శాసనసభ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్గా పనిచేసిన పి.ఎస్. రామన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ పదవిలో విజయ్ నారాయణ్ను నియమిస్తూ కొత్త ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన మద్రాస్ హైకోర్టులో బాధ్యతలు చేపట్టారు.
విజయ్ నారాయణ్ ప్రస్థానం..
విజయ్ నారాయణ్ ప్రముఖ న్యాయవాద కుటుంబం నుంచి వచ్చారు. రాజ్యాంగ నిపుణుడు ఎం.కె. నంబియార్ మనవడు, ప్రస్తుత భారత అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్కు ఆయన సమీప బంధువు. ప్రసిద్ధ చరిత్రకారుడు సర్దార్ కె.ఎం. పణిక్కర్ ఆయకు మామయ్య అవతారు. బిహార్లో పాఠశాల విద్య, చైన్నె లయోలా కళాశాలలో డిగ్రీ, మద్రాస్ లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. 2004లో మద్రాస్ హైకోర్టు ఆయనకు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించింది. లేబర్ లా, రాజ్యాంగ చట్టం, వాణిజ్య చట్టాలలో ఆయనకు విశేష అనుభవం ఉంది. గతంలో ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వ హయాంలో (2017 – 2021) కూడా తమిళనాడు అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. మద్రాస్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి న్యాయపరమైన సలహాలు అందించడంలో, కోర్టుల్లో ప్రభుత్వ వాదనలను బలంగా వినిపించడంలో విజయ్ నారాయణ్ కీలక పాత్ర పోషించనున్నారు.


