సాక్షి, చైన్నె: ఎస్ఆర్ఎం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రామాపురం, తిరుచ్చి చైర్మన్ డాక్టర్ ఆర్ శివకుమార్ 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్టాన్లీ అల్యుమినీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అవయవ దాన అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. విద్యార్థులు , అధ్యాపకులలో అవయవ దానంపై అవగాహన కల్పించే విధంగా ముందుకెళ్లారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నిర్వహించిన అవగాహన సదస్సుతో స్ఫూర్తి పొందిన 60 మందికి పైగా ఎస్ఆర్ఎం సిబ్బంది తమ అవయవాలను దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన అంగీకార పత్రాలను స్టాన్లీ అల్యుమినీ అసోసియేషన్కు అందజేశారు. కార్యక్రమంలో స్టాన్లీ అల్యుమినీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్. వరదరాజన్, ఫైనానన్స్ సెక్రటరీ డాక్టర్ శరవణన్ వేదగిరితో పాటూ 1983 బ్యాచ్ పూర్వ విద్యార్థులు డాక్టర్ బాబా, డాక్టర్ ప్రేమ్ కూడా పాల్గొని అవయవ దాన విశిష్టతను వివరించారు. ఎస్ఆర్ఎం విద్యా సంస్థల డైరెక్టర్లు, వివిధ విభాగాల అధిపతులు, బోధనా , బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని, సామాజిక బాధ్యతను చాటుకున్నారు.


