వేలూరు: వేలూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన గుడియాత్తం గంగమ్మ ఆలయ జాతర రథోత్సవం గురువారం ఉదయం కోలాహలంగా జరిగింది. ప్రతి ఏడాది తమిళ వైకాశి మాసం మొదటి వారంలో జాతర నిర్వహించడం ఆనవాయితీ. జాతరలో భాగంగా శుక్రవారం ఉదయం శిరస్సు ఉత్సవం జరగనున్న నేపథ్యంలో గురువారం ఉదయం అమ్మవారిని వివిధ పుష్పాలతో అలంకరించారు. ఆలయం ముందున్న రథాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి అమ్మవారిని అందులో ఆశీనులు చేసి పట్టణ వీధుల్లో భక్తులు రథాన్ని లాగారు. భక్తులు రథంపై బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు వివిధ వేషధారణలు ధరించి అమ్మవారికి అంబలి పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రథం సాయంత్రం అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ శివరామన్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం శిరస్సు ఉత్సవం జరగనుంది. సాయంత్రం అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సును విడదీసే కార్యక్రమం, బాన వేడుకలు జరగనున్నాయి.


