సాక్షి, చైన్నె : శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కు చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు ఆరోగ్య రంగంలో ఒక కీలక ముందడుగు వేశారు. శ్రీ రామచంద్ర ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన మెడ్యూరా అనే సరికొత్త డిజిటల్ హెల్త్ అప్లికేషన్ను బుధవారం ఆవిష్కరించారు. ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ట్రస్ట్ ట్రస్టీ సంయుక్త్తా వెంకటాచలం ఈ యాప్ను ఆవిష్కరించి విద్యార్థులను అభినందించారు.
యాప్ ప్రత్యేకతలు..
ఈ యాప్ రోగులను నేరుగా వైద్యులు, ఫార్మసీలు ,డయాగ్నస్టిక్ లాబొరేటరీలతో అనుసంధానిస్తుంది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి , తృతీయ శ్రేణి నగరాల్లోని ఆసుపత్రులలో వైద్య సేవలను మరింత సులభతరం చేయడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యంగా ప్రకటించారు. రోగులు తమకు కావాల్సిన వైద్య సేవలను ఒకే వేదిక ద్వారా సులభంగా పొందేందుకు ఇది దోహదపడుతుందన్నారు. దీనిని స్టూడెంట్ వెంచర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా రూపొందించారు. ఎంపికై న ప్రతిభావంతులైన విద్యార్థి బృందాలకు తమ వినూత్న ఆలోచనలను ఆచరణాత్మక స్టార్టప్లుగా మార్చుకునేలా సహకారం అందించారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర వైస్ చాన్స్లర్ డాక్టర్ ఉమా శేఖర్, మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ కె. బాలాజీ సింగ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సెంథిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


