సాక్షి, చైన్నె: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తన ఎన్నికల హామీలను అమలు చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని మంగళవారం ఆదేశించారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పరిమితులు ఇవే..
విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలు (ఆలయాలు, చర్చిలు, మసీదులు). బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను గుర్తించి మూసివేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ 717 దుకాణాలను రాబోయే రెండు వారాల్లోపు పూర్తిగా మూసివేయాలని అధికారులకు గడువు విధించారు.
ప్రార్థనా స్థలాల సమీపంలో 276, విద్యాసంస్థల (స్కూళ్లు, కాలేజీలు) సమీపంలో 186, బస్టాండ్ల సమీపంలో 255 దుకాణాలు అంటూ మొత్తం 717గా నిర్ణయించారు. తమిళనాడులో ప్రస్తుతం మొత్తం 4,765 ప్రభుత్వ మద్యం దుకాణాలు పనిచేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం , సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మద్య నిషేధం అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల వాగ్దానంగా తాను ఇచ్చిన మేరకు దశల వారీ అమలులో భాగంగా 717 దుకాణాలను మూసి వేయడానికి ఉత్తర్వులు ఇవ్వడాన్నిసర్వత్రా ఆహ్వానిస్తున్నారు. ఇదిలా ఉండగా గతం డీఎంకే ప్రభుత్వంలో ఇదే తరహాలో 2023లో కూడా సుమారు 500 దుకాణాలను ప్రభుత్వం మూసివేసిన సంగతి తెలిసిందే.


