వేలూరు: నర్సింగ్ సిబ్బంది సేవాభావాన్ని కలిగి ఉండాలని సంధ్య ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి బత్తల సూరిబాబు అన్నారు. వేలూరు సత్వచ్చారిలోని సంధ్యా ఆసుపత్రిలో అంతర్జాతీయ తల్లుల దినోత్సవం, నర్సుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వివిధ సేవలు అందజేసిన నర్సులను అబినందించి సర్టిఫికెట్లను అందజేశారు. ముందుగా నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సంధ్యాబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బత్తల సూరిబాబు మాట్లాడుతూ దేశంలో అన్ని సేవలకన్నా నర్సులు చేసే సేవ మరువరాదన్నారు. ప్రమాదంలో ఉన్న వారిని డాక్టర్ల కన్నా ముందుగా నర్సులే చూస్తారని వారితో ప్రేమతో మాట్లాడి వారికి అవసరమైన వైద్య సేవలు అందజేయాలన్నారు. నర్సులు ఈ వృత్తిని ఉద్యోగంగా చూడకుండా సేవాభావంతో చూడాలన్నారు. రోగులతో ప్రేమగా మాట్లాడడంతోనే వారికి సగం రోగం నయమవుతుందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో ప్రతి ఒక్కరూ స్నేహ పూర్వకంగా కుటుంబ సభ్యుల తరహాలో చూడాలన్నారు. రోగుల సంక్షేమంపై నర్సులు కనబరిచే అంకితభావం, నిబద్దతను ఆయన కొనియాడారు. డాక్టర్ సంధ్యాబాబు మాట్లాడుతూ నాణ్యమైన వైద్య సంరక్షణను అందజేయడానికి నర్సులు తమ వృత్తి పరమైన జ్ఞానాన్ని మెరుగు పరుచుకోవాలన్నారు. అనంతరం విశిష్ట సేవలు అందజేసిన నర్సులకు సర్టిఫికెట్లును అందజేశారు. ఈ కార్యక్రమంలో షణ్మగ ప్రియ, సుధ, చిత్ర, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


