సాక్షి, చైన్నె: వైద్య రంగంలో డయాగ్నోస్టిక్స్ విభాగంలో సరికొత్త విప్లవానికి అపోలో డయాగ్నోస్టిక్స్ డీజీ–స్మార్ట్ సెంట్రల్ రిఫరెన్స్ లాబొరేటరీ రికార్డు సృష్టించినట్టు నిర్వాహకులు ప్రకటించారు. గురువారం మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ. దక్షిణ, ఆగ్నేయ ఆసియాలోనే 4వ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ లాబొరేటరీగా ఇది రికార్డు సృష్టించిందని ప్రకటించారు. తమ డిజి–స్మార్ట్ ల్యాబ్ డయాగ్నోస్టిక్ పరిణామ క్రమంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. ప్రతి శాంపిల్ వెనుక ఒక ప్రాణం ఉంటుందనే బాధ్యతతో తమ బృందం పనిచేస్తున్నట్టు వివరించారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్, జెనోమిక్ సైనన్స్ వంటి సాంకేతికతలను మరింతగా ఉపయోగించి వ్యక్తిగత చికిత్సలో కొత్త ఒరవడిని సృష్టిస్తాం అని తెలిపారు. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి డయాగ్నోస్టిక్స్ కేవలం కొందరికే పరిమితం కాకుండా, ప్రతి భారతీయుడికి అందాలనేదే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఏఐ ఆధారిత ఆటో–వ్యాలిడేషన్ సిస్టమ్స్ ద్వారా వైద్యులు వేగంగా , సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తున్నామని అని పేర్కొన్నారు. ఈ కేంద్రం ప్రతిరోజూ 40,000 శాంపిల్స్ పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, గడిచిన 12 నెలల్లో ఈ ల్యాబ్ 86 లక్షల వైద్య పరీక్షలను నిర్వహించిందని వివరించారు.


