తిరువళ్లూరు: పంగుణి ఉత్సవాల్లో భాగంగా పద్మావతీ, శ్రీనివాస పెరుమాల్, పుంగుయళీ సమేత పుష్పవనేశ్వరస్వామికి తిరుకల్యాణం కమనీయంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా పూంగానగర్లోని శివవిష్ణు ఆలయంలో ప్రతి ఏటా పంగుణి ఉత్తర ఉత్సవాల్లో భాగంగా తిరుకల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల మధ్య పద్మావతీ, శ్రీనివాస పెరుమాల్, శ్రీపూంగుయళీ సమేత పుష్పవనేశ్వర స్వామికి కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం ఊంజల్సేవ నిర్వహించారు. భక్తులకు మంగళసూత్రాలు అందజేశారు.
అన్నానగర్: ఊటీలోని ఎనిమిది ప్రధాన ఉద్యానవనాల్లో బుధవారం నుంచి సినిమా షూటింగ్ నిషేధం విధించారు. ప్రభుత్వం బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్ వంటి ప్రదేశాలలో నిర్ధిష్ట రుసుములతో ఫొటోగ్రఫీకి అనుమతి మంజూరు చేస్తోంది. ఈ స్థితిలో, ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేసవి కాలం ప్రారంభమైంది. ఈ మూడు నెలల్లో లక్షలాది మంది పర్యాటకులు ఊటీకి రానున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు జిల్లాలోని ప్రధాన ఉద్యానవనాలలో బుధవారం నుంచి షూటింగ్పై నిషేధం విధించారు. ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు మాట్లాడుతూ వేసవి ఉత్సవానికి ముందుగానే పార్కులలో పూల మొక్కలు నాటారని, అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆ మొక్కలకు నష్టం జరగకుండా నివారించేందుకు ఈ తాత్కాలిక నిషేధాన్ని జారీ చేశారని నవనీత తెలిపారు.
అన్నానగర్: బాలికపై లైంగికంగా వేధించిన కేసులో ఇద్దరిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్నెలోని తురైపాక్కం ప్రాంతంలో తన ఇంటి మొదటి అంతస్తులో నివసించే 5వ తరగతి విద్యార్థిని స్నేహితులతో ఆడుకోవడానికి టెర్రస్ పైకి వెళ్లింది. ఆ సమయంలో, కింది అంతస్తులో నివసించే కృష్ణమూర్తి (48) కూడా పైకి వెళ్లి వారితో ఆడుకుంటున్నట్లు నటించి, ఆ తర్వాత వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు తరమణి మహిళా పోలీస్స్టేషన్న్లో ఫిర్యాదు చేశారు. బాలల సంక్షేమ కమిటీకి కూడా సమాచారం అందించారు. పోలీసుల విచారణలో అదే వీధిలో నివసించే నారాయణస్వామి (26) కూడా బాలికలను లైంగికంగా వేధించినట్లు తెలిసింది. తరమణి మహిళా పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, మంగళవారం సాయంత్రం కృష్ణమూర్తి (48), కార్తీక్ (26)లను అరెస్టు చేశారు.
భాకరాపేట(ఎర్రావారిపాళెం): సినీ రచయిత వెన్నెలకంటి శిష్యుడిగా పలు అనువాద చిత్రాలకు మాటలు అందించిన మల్లూరి వెంకట్కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి యర్రక్క (94) కన్నుమూశారు. బుధవారం ఈమేరకు స్వగ్రామం ఎర్రావారిపాళెంలో అంత్యక్రియలు నిర్వహించారు. వెంకట్ బాల్య స్నేహితుడు, వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అన్నానగర్: తిరుచ్చి జిల్లాలోని మనప్పారై రైల్వే రోడ్డులో బుధవారం తెల్లవారుజామున ధర్మరాజ్కు చెందిన పుస్తకాల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దుకాణం నుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మనప్పారై, వైయంపట్టికి చెందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.కోటి విలువ చేసే పుస్తకాలు, ఇతర వస్తువులు బూడిదైపోయాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


