వేలూరు: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చెందడం ఖాయమని అందువల్లే ఎడపాడి పళణిస్వామి అమలు చేయలేని మేనిఫెస్టోలను ప్రకటించారని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలో కాట్పాడి, కేవీ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను డీఎంకే పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాట్పాడిలో తనను పలువురు ఎమ్మెల్యే అభ్యర్థిగా చెపుతున్నప్పటికీ తాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ అధిష్టానం ఎవరిని ప్రకటిస్తుందో వారే అభ్యర్థి అన్నారు. తాను సీఎం స్టాలిన్తో తరచూ ఉంటూ పలు సమస్యలను నేరుగా చూసిన వ్యక్తి అయినప్పటికీ సీఎం స్టాలిన్తో పాటు అధిష్టానం ఎవరిని ప్రకటించినా అందుకు తాను సిద్ధపడి ఉండాలన్నారు. ప్రస్తుతం డీఎంకే పార్టీలో కూటమి పార్టీల సీట్లను ఒక రకంగా సర్దుబాటు చేశారన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎడపాడి పళనిస్వామి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో పసలేని మేనిఫెస్టోగా ఉందన్నారు. అధికారంలోకి రామని తెలిసి వారు ఇటువంటి హామీలను ఇచ్చారన్నారు. వీటిని ప్రజలు నమ్మరన్నారు. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో తాను లేనని త్వరలోనే మంచి మేనిఫెస్టోను ప్రజలకు ప్రకటిస్తామన్నారు. తాను ప్రస్తుతం రాజకీయాలు మాట్లాడబోమని తేల్చి చెప్పి వెళ్లిపోయారు. ఎంపీ కదిర్ఆనంద్, ఎమ్మెల్యే కార్తికేయన్, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, డివిజన్ కార్యదర్శి వన్నియరాజ, మాజీ ఎమ్మెల్యే లత, కోశాధికారి నరసింహన్, యూనియన్ చైర్మన్ వేల్మురుగన్, వైస్ చైర్మన్ శరవణన్, యూనియన్ కార్యదర్శి తనికాచలం పాల్గొన్నారు.


