తిరువళ్లూరు: ప్రసిద్ధి చెందిన శ్రీ ఆనందవల్లి సమేత తిరుకాళీశ్వరర్ ఆలయంలో మహాకుంభాభిషేకం బుధవారం వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ కన్నిగపేర్ తిరుకండలం గ్రామంలో ప్రసిద్ది చెందిన శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ తిరుకాళీశ్వరర్ ఆలయం ఉంది. సుమారు రెండువేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం శిధిలావస్థకు చేరిన క్రమంలో ఆలయాన్ని ఇటీవల పునరుద్ధరించారు. పనులు పూర్తయిన క్రమంలో కుంభాభిషేకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గోపూజ, విఘ్నేశ్వర పూజ, నవగ్రహాహోమం, గణపతి హోమం, ఐశ్వర్య కుభేర హామంతో పాటు ఇతర పూజలు నిర్వహించారు. అనంతరం బుధవారం ఉదయం పది గంటలకు కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఉత్సవాల్లో వందలాది మంది భక్తులు పాల్గోనగా, భక్తులకు ప్రసాదంతో పాటూ అన్నదానం నిర్వహించారు.


