తిరువళ్లూరు: పంగుణి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోలీశ్వరుడు భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పేరంబాక్కంలోని కామాక్షి సమేత సోలీశ్వరుడి ఆలయంలో పంగుణి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రెండవరోజు సోమవారం రాత్రి స్వామివారు భూత వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
నేతలతో పీయూష్ భేటీ
– అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
సాక్షి, చైన్నె : బీజేపీ నేతలతో ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తులు మొదలెట్టారు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీకి 27 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పార్టీకి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి మళ్లీ సీటు కేటాయించడం ఖాయం. మిగిలిన 23 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తులపై పీయూష్ దృష్టి పెట్టారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పోటీ చేసే దిశగా పీయూష్తో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారాలు వెలువడ్డాయి. అలాగే కన్యాకుమారి జిల్లాలో ఓనియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కేంద్ర మాజీ మంత్రి పోన్ రాధాకృష్ణన్, చైన్నెలో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో సీట్ల విషయంగా పీయూష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడాల్సిందేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా స్పష్టం చేసినట్టు సమాచారం. సీట్ల కోసం ఢిల్లీకి నేతలు ఎవ్వరూ రావద్దు అని రాష్ట్ర పార్టీ వర్గాలకు అమిత్ షా కార్యాలయం నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడటం గమనార్హం.
పెయింటర్ హత్య
అన్నానగర్: విరుదునగర్ జిల్లాలో పెయింటర్ హత్యకు గురయ్యాడు. విరుదునగర్ జిల్లాలోని సాత్తూరు సమీపంలోని అచన్కుళం ప్రాంతానికి చెందిన మదిసెల్వం (55) పెయింటర్. ఇతను భార్యతో విడిపోయి 4ఏళ్లు వేరుగా ఉంటున్నాడు. ఈ స్థితిలో మదిసెల్వం రెండు రోజుల క్రితం అచన్కుళం ప్రాంతంలో ఒక బంధువు ఇంట్లోని కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ సహదేవన్ కుమారుడు రాజపాండి (24) సెల్ఫోన్ కనిపించకుండా పోయిందని తెలిసింది. ఈ స్థితిలో సోమవారం రాత్రి, మదిచెల్వం, రాజపాండి, అతని సోదరుడు గురుపాండి, స్నేహితులు మనోజ్, నవీన్న్ వేంపక్కోట్టైలోని ఒక మద్యం దుకాణంలో కలిసి మద్యం తాగారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు సెల్ఫోన్ కనిపించకపోవడంతో సమస్య తలెత్తింది. రాజపాండి, అతని సోదరుడు మదిసెల్వంతో గొడవ పడ్డారు. గొడవ ముదరడంతో రాజపాండి, అతని సోదరుడు సహా మరో ఇద్దరు వ్యక్తులు అక్కడి పెరుమాళ్ ఆలయం సమీపంలో మాదిసెల్వంపై దాడి చేశారు. దాడిలో అతను మృతిచెందాడు. విషయం తెలిసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
నీటి బకెట్లో పడి
చిన్నారి మృతి
అన్నానగర్: నీటి బకెట్లో పడి ఓ చిన్నారి మృతిచెందింది. బిహార్కు చెందిన దినేష్ (28). ఇతని భార్య కుమారి (25). వీరు కోయంబత్తూరులోని రామ్నగర్లో నివసిస్తూ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ఒక ఏడాది వయస్సు పాప ఉంది. సోమవారం రాత్రి చిన్నారి ఇంట్లో ఆడుకుంటోంది. ఈ క్రమంలో వంటగదిలో నీళ్ల బకెట్లో పాప బోర్లా పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు వెంటనే పాపను ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు, అప్పటికే చిన్నారి మృతిచెందిందని నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


