విద్యార్థి ఆత్మహత్య
తిరువొత్తియూరు: మాధవరం సమీపంలో ఉన్న మాత్తూర్ ప్రాంతంలో పాఠశాల విద్యార్థి పరీక్షల భయంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మాధవరం పాలపణ్ణై సమీపంలో ఉన్న మాత్తూర్, ఎం.ఎం.డి.ఎ. మొదటి వీధి, 32వ క్రాస్ వీధికి చెందిన శక్తివేల్ కుమారుడు సంతోష్ కుమార్ (17). ఇతను మనలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్లస్టూ చదువుతున్నాడు. ఇతిని తండ్రి పెయింటర్. తల్లి రోసి కేక్ తయారీ సంస్థలో పనిచేస్తుంది. సంతోష్ చదువులో వెనుకబడి ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇంట్లోఎవరూ లేని సమయంలో పరీక్షల భయంతో బెడ్రూమ్లోని ఫ్యాన్న్కు చీరతో ఉరి వేసుకున్నాడు. పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన అతని చెల్లెలు కీర్తన, గదిలో ఉరివేసుకుని వేలాడుతున్న అన్న సంతోష్ను చూసి కేకలు పెట్టింది. ఆమె కేకలు విని ఇరుగుపొరుగు వచ్చి సంతోష్కుమార్ను కిందకు దించి చూడగా అప్పటికే మృతిచెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న మాధవరం పాలపణ్ణై పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నారు.
ఉంగరాల అమ్మకాలు పెరిగాయి
కొరుక్కుపేట: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కోయంబత్తూరులో పార్టీ నాయకుల చిత్రాలు ఉన్న బంగారు ఉంగరాలను తయారు చేసి అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, జయలలిత, ఎడపాడి పళనిస్వామి, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, విజయకాంత్, విజయ్, కమలహాసన్, టీటీడీ దినకరన్ వంటి నాయకుల చిత్రాలు ఉన్న ఉంగరాలు శరవేగంగా అమ్ముడవుతున్నాయ. పార్టీ కార్యనిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులు, యువతను ఆకర్షించడానికి ఈ ఉంగరాలను వివిధ ఆకారాలు, పరిమాణాలలో తయారు చేసి విక్రయిస్తున్నారు. యువత, పార్టీ సభ్యులు వాటిని కొనుగోలు చేస్తున్నారని, ఈ ఉంగరాలను రూ. 850 నుంచి రూ. 1000 మధ్య అమ్ముతున్నారని విక్రేతలు తెలిపారు.


