డీఎంకే ప్రభుత్వంలో రక్షణ కరువు
వేలూరు: రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు రక్షణ కరువై శాంతి భద్రతలు లేకుండా పోయాయని బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తియాయిని అన్నారు. వేలూరు కలెక్టరేట్ ఎదుట బీజేపీ పార్టీ ఎస్సీ, ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో డీఎంకే ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఆందోళన నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు పలు ఉచిత హామీలను ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన డీఎంకే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఉచిత పథకాలు అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న డీఎంకే ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఎందుకు ఇటువంటి పథకాలను ప్రవేశ పెట్టలేదన్నారు. ప్రస్తుతం ఎన్నికలు రానున్న నేపథ్యంలో పథకాలను ప్రవేశ పెడుతున్నట్లు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు, లైంగికదాడులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రజలు రాత్రి వేళల్లో బయటకు వచ్చేందుకు కూడా బయటపడుతున్నారని ప్రజలకు రక్షణ లేకుండా ఉందన్నారు.
బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాసంక్షేమం దృష్టిలో ఉంచుకొని పలుకోట్ల నిధులను తమిళనాడుకు మంజూరు చేస్తుంటే రాష్ట్రానికి కేంద్రం ఎటువంటి నిధులు మంజూరు చేయడం లేదని పచ్చి అబద్ధం చెపుతున్నారన్నారు. అనంతరం డీఎంకే ప్రభుత్వాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఆందోళనలో ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ విభాగం జిల్లా అద్యక్షుడు మదన్కుమార్, రీజినల్ కార్యదర్శులు మది, హరి, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు కబీర్, సమాచార విభాగం జిల్లా అధ్యక్షుడు కుమరన్, కార్యకర్తలు పాల్గొన్నారు.


