బ్యాంకు ఉద్యోగాలపై యువత ఆసక్తి
తిరువళ్లూరు: ఇంజినీరింగ్ విద్యార్థుల్లో సైతం బ్యాంకు ఉద్యోగాలపై ఇటీవల ఆసక్తి పెరిగిందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రీజినల్ చీఫ్ మేనేజర్ రాజశేఖర్ వ్యాఖ్యానించారు. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్ఎంకే మెట్రిక్ పాఠశాలలో 22వ క్రీడా దినోత్సవం జరిగింది. ఈ కార్యమ్రానికి ఆర్ఎంకే విద్యాసంస్థల చైర్మన్ ఆర్ఎస్ మునిరత్నం అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు చీఫ్ మేనేజర్ రీజినల్ మేనేజర్ రాజశేఖర్ హాజరయ్యారు. మొదట విద్యార్థులు నిర్వహించిన కవాతును పరిశీలించి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాజ్యోతిని విద్యార్థులకు అందించి క్రీడా పోటీలను ప్రారంభించారు. దీంతో పాటు క్రీడల్లో విజయం సాధించిన విద్యార్దులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం చైర్మన్ ఆర్ఎస్ మునిరత్నం మాట్లాడుతూ విద్యార్థులు చదువులతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను క్రీడాకోటాలో దక్కించుకోవచ్చని వ్యాఖ్యానించారు. అనంతరం ఇండియన్ ఓవర్సీన్ రీజినల్ చీఫ్ మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఇటీవల ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు సైతం ఐటీ రంగాల కంటే బ్యాంకు ఉద్యోగాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. పోటీ పరీక్షలకు ప్రాథమిక దశ నుంచే విద్యార్థులు సిద్ధ కావాలని సూచించిన ఆయన, క్రీడల్లో పాల్గోనడం ద్వారా మెదడు చురుకుగా పనిచేస్తుందని వివరించారు. గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, హార్ధిక్పాండ్యా, ధోనీ తదితర క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. దీంతో పాటు విద్యార్థులు బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభించి పొదుపు అలవాటును అలవర్చుకోవాలని పిలుపు నిచ్చారు. అనంతరం క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి సర్టిఫికెట్లు, కప్లను అందజేశారు. గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ధనుశ్రీ, హర్షాఖ్, గురుదర్శినీ ప్లస్టూలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దువ్వూరు హసినీ, హర్షిత, అలెన్జోసెబ్, సుప్రియ తదితరులను సన్మానించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ ఆర్ఎం కిషోర్, సలహాదారుడు మనోహరన్, ప్రిన్సిపల్ వనఅరసు, వైస్ ప్రిన్సిపల్ గీత తదితరులు పాల్గొన్నారు.


