ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు
వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని శివాలయాల్లో ప్రదోష దినోత్సవాన్ని పురష్కరించుకొని శుక్రవారం నంది భగవాన్కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అరుణాచలేశ్వరాలయంలోని పెద్ద నంది భగవాన్కు శివాచార్యులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి వివిధ కాయ గూరలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం శివాచార్యులు కర్పూర హారతి పట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నందీశ్వరుడిని అలంకరించిన బంగారు వృషభ వాహనంలో ఉంచి ఆలయ మూడవ ప్రాకారం నుంచి మాడ వీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జలగంఠేశ్వరాలయంలోని నంది భగవాన్కు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు పట్టారు. అదేవిధంగా వాలాజాలోని శ్రీ ధన్వంతరి ఆరోగ్యపీఠంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు.
ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు


