ప్రభుత్వమే సోలార్ కంచె వేయాలి
వేలూరు: అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ప్రభుత్వమే సోలార్ విద్యుత్ కంచె ఏర్పాటు చేయాలని రైతు నాయకులు కోరారు. వేలూరు కలెక్టరేట్లో డీఆర్ఓ అధ్యక్షతన జిల్లాలోని రైతు నాయకులతో సమావేశం జరిగింది. రైతులు మాట్లాడుతూ ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన కుప్పం నుంచి చైన్నె వరకు పాలారు ఉందని భారీ వర్షం వస్తే ఇందులో నీరు ప్రవహించి కుంటలు, చెరువులకు నీరు చేరుతుందన్నారు. అయితే వానియంబాడి నుంచి కాంచీపురం మీదుగా తిరువళ్లూరు వరకు వెళ్లే పాలారులో వివిధ పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీటితో పాలారు కలుషితమవుతోందన్నారు. దీంతో సాగు చేయకపోవడంతో పాటు తాగునీరు కూడా కలుషితమై రోగాల బారిన పడుతున్నామన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటలను అడవి పందులు ధ్వసం చేస్తుండడంతో రైతులు వ్యవసాయం చేయడమే మానే స్తున్నారన్నారు. పంటలను కాపాడుకునేందుకు విద్యుత్ కంచెలు వేస్తే పోలీసు కేసులు నమోదు చేస్తున్నారన్నారని, ప్రభుత్వమే సోలార్ విద్యుత్ కంచె ఏర్పాటు చేయాలని కోరారు. అటవీ ప్రాంతాల్లో పండించే పంటలను అడవి ఏనుగులు, పందులు నాశనం చేస్తున్నాయని వీటికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. స్పందించిన జిల్లా రెవెన్యూ అధికారి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. రైతులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.


