దంత వైద్యశాలలో చోరీ
ఇద్దరి అరెస్ట్
తిరువొత్తియూరు: దంత వైద్యశాలలో రూ.25 వేలు నగదు, వస్తువులను చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె నోళంబూర్ 22వ వీధికి చెందిన డాక్టర్ భరత్, అదే ప్రాంతంలో దంత వైద్యశాల నడుపుతున్నారు. గత 22వ తేదీ రాత్రి వైద్యశాలకు తాళం వేసి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం పనిమనిషి వైద్యశాలను శుభ్రం చేయడానికి వచ్చినపప్పుడు వైద్యశాల తెరిచి ఉంది. వెంటనే భరత్కు సమాచారం ఇచ్చింది. భరత్ క్లినిక్కి వెళ్లి చూడగా రూ. 25 వేల నగదు, వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించారు. భరత్ నోళంబూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వైద్యశాల సీసీ ఫుటేజీని పరిశీలించగా బైక్పై వచ్చిన ఇద్దరు ఇనుప రాడ్డుతో తాళం పగలగొడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చోరికి పాల్పడిన మధురవాయల్ ఏరిక్కరై ధనలక్ష్మి నగర్, సమీపంలో ఉన్న నెర్కుండ్రం ప్రాంతానికి చెందిన లక్ష్మణన్(22) మేట్టుకుప్పానికి చెందిన అరుణ్కుమార్ (21) లను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
● స్కిల్డ్ సెంటర్
అడయార్లో క్లినిక్ అండ్ స్కిల్డ్ నర్సింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గెరికేర్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ సెంటర్ను ప్రముఖ రచయిత్రి భారతీ భాస్కర్, పద్మశ్రీ డాక్టర్ వీఎస్ నటరాజన్, న్యూరాలజిస్టు ప్రొఫెసర్ ఏవీ శ్రీనివాసన్, గెరికేర్ ఎండీ డాక్టర్ లక్ష్మీపతి రమేష్ ప్రారంభించారు. ఇక్కడి సేవలను లక్ష్మీపతి రమేష్ వివరించారు. – సాక్షి, చైన్నె


