రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ పెట్టెలు!
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పార్టీ తరపున మ్యానిఫెస్టో రూపకల్పనలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి సన్నద్ధ్దమయ్యారు. ఇందుకోసం అభిప్రాయల పెట్టెను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వివరాలు.. తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీవీకే అధినేత విజయ్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రయాణంలో ఆయనకు ఎదురు అవుతున్న ఒడి దొడుగులు మరీ ఎక్కువే.. మీట్ ది పీపుల్ అంటూ ప్రజలలోకి వెళ్తున్న సమయంలో కరూర్ విషాద ఘటన ఆయనకు బ్రేక్ వేసింది. ఆ తదుపరి ఈ ప్రయణం అన్నది ముందుకు సాగడం లేదు. అదే సమయంలో తన చివరి చిత్రంగా పేర్కొంటున్న జననాయకన్ విడుదల వివాదంలో మునిగింది. ఈ పరిస్థితులో ఎన్నికల ప్రచార వ్యవహారాలన్ని పర్యవేక్షించేందుకు ముందు జాగ్రత్తగా కమిటీని రంగంలోకి దించారు. పార్టీప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, డిప్యూటీ ప్రచార కార్యదర్శి ఆదవ్ అర్జునన్, వర్కింగ్ కమిటీ కన్వీనర్ సెంగొట్టయ్యన్తో పాటుగా పార్తీబన్, రాజ్కుమార్, విజయ్ దాము, ఎస్పీ సెల్వం, కె పిచాయ్ రత్నం, తదితరులతో 10 మందిని నియమించారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు వంటి అన్ని వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షణలో జరిపే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే పార్టీ ఎన్నికల మ్యానిపెస్టో రూపకల్పనకు మరో కమిటీని నియమించారు.
తుది కసరత్తు కోసం..
పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతృత్వంలోని ఈ కమిటీలో అరుణ్ రాజ్, జేసీటీ ప్రభాకర్, ఎన్. ఆనంద్, రాజ్ మోహన్, తదితరులు ఉన్నారు. ఈ కమిటీ అన్ని రకాల పరిశీలనలు, సమగ్ర అధ్యయనం ముందుకెళ్తోంది. కొన్ని కీలక అంశాలతో నివేదికను సిద్ధం చేసింది. దీనిపై తుది కసరత్తు మొదలెట్టారు. అదే సమయంలో ప్రజలను సైతం భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా అభిప్రాయల పెట్టేను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. విజయ్ ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాలలో ప్రజల సమస్యలు, విజ్ఞప్తులను, సూచనలు, సలహాలను స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు ఈ అభిప్రాయల పెట్టెలో తమ సమస్యలు, ప్రాంత సమస్యలను విన్నవించి లిఖిత పూర్వంగా దాఖలు చేయవచ్చు అన్న సూచనను ఇవ్వడానికి విజయ్ పార్టీ వర్గాలు సిద్ధమయ్యాయి. ఒకటి రెండు రోజులలోఈ అభిప్రాయాల పెట్టేను అన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నారు. ఇక గురువారం ఈ విషయంగా జరిగిన సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతలకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం గమనార్హం. అలాగే,కష్టపడి పనిచేసే వారికి సీట్లు, పదవులు గ్యారంటీ అని భరోసా ఇచ్చారు. కాగా మీట్ దీ పీపుల్ప్రచారానికి బ్రేక్ పడిన దృష్ట్యా, ఫిబ్రవరిలోవిజయ్ నేతృత్వంలో నాలుగు చోట్ల బహిరంగ సభల నిర్వహనకు టీవీకే వర్గాలు సన్నద్ధమయ్యాయి.


