ఘనంగా నాగేశ్వరస్వామి ఆలయ కుంభాభిషేకం
పళ్లిపట్టు: పెద్ద నాగపూండిలో పురాతన నాగవళ్లి సమేత నాగేశ్వరస్వామి ఆలయ మహాకుంభాభిషేకం బుధవారం వేలాది మంది భక్తజనం నడుమ కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం శివ నామస్మరణతో మార్మోగింది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి అనుబంధంగా ఉండే ఆర్కేపేట సమీపంలోని పెద్దనాగపూండిలో పురాతన నాగవళ్లి సమేత నాగేశ్వరస్వామి ఆలయ కుంభాభిషేకం ఏర్పాట్లను ఆక్స్పోర్డు విద్యాసంస్థల అధినేత ఎస్ఎన్విఎల్. నరసింహరాజ్ అలియాస్ రమేష్రాజు చేపట్టారు. ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు చేపట్టి విమాన గోపురం, రాజగోపురం సహా సన్నదులు, ధ్వజస్తంభం, రంగులుతో అలంకరించారు. జీర్ణోద్ధరణ పనులు పూర్తి కావడంతో ఆదివారం నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటూ మహాకుంభాభిషేకం వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంతో పాటూ పరిసర ప్రాంతాలు రంగుల విద్యుదీపలంకరణ చేపట్టి పుష్పాలతో కనువిందు చేశారు. ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి శివాచార్యుల బృందం హోమపూజలు చేపట్టారు. ఇందులో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వములు, రత్నగిరి బాల మురుగన్ స్వాములు పాల్గొన్నారు. బుధవారం ఉదయం మహాకుంభాభిషేకం సందర్భంగా షోళింగర్, తిరుత్తణి, పళ్లిపట్టు పరిసర ప్రాంతాలతో పాటు ఆంధ్రలోని చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేడుకల్లో టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి, షోళింగర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ రవి, సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖులకు ఆలయ ఉభయదారులు నరసింహరాజ్ అలియాస్ రమేష్రాజు ఘనంగా సత్కరించారు. తిరుత్తణి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ శ్రీదరన్, జాయింట్ కమిషనర్ రమణి, ట్రస్టీలు సురేష్బాబు, ఉషారవి, మోహనన్, నాగన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఘనంగా నాగేశ్వరస్వామి ఆలయ కుంభాభిషేకం


