4 వేల ఆలయాల్లో కుంభాభిషేకాలు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 4 వేల ఆలయాలకు కుంభాభిషేకాలు పూర్తి చేశారు. ఇక బుధవారం రోజున పలు ఆలయాలలో కుంభాభిషేక వేడుకలు కనుల పండువగా జరిగాయి. అలాగే తైపూసం తొలి ముహూర్తం కావడంతో రాష్ట్రంలోని ఆలయాలలో కొత్త జంటలకు వివాహాలు జోరుగా జరిగాయి. వివరాలు.. తమిళ్ కడవుల్ మురుగన్కు ప్రసిద్ధి చెందిన ఆరుప్పడై వీడులుగా పిలవబడే ఆలయాలు రాష్ట్రంలోనే ఉన్నవిషయం తెలిసిందే. తమిళనాడులో తైమాసం మొదలైతే చాలు ఈ ఆలయాలలో తై పూసం ఉత్సవాలు మిన్నంటాయి. ఈ మాసంలో తొలి ముహూర్తం రోజు బుధవారం వేళ వచ్చింది. దీంతో వేకువ జాము నుంచి మురుగన్ ఆలయాలు భక్తులతో కిట కిటలాడాయి. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని ప్రసిద్ధి చెందిన సెంథిల్ అండవర్ ఆలయం భక్తులతో నిండింది. కొత్త జంటలతో ఆలయం కళకళ లాడింది. ఆలయ ఆవరణలో ఈ ఒక్క రోజున సుమారు 150 జంటలకు వివాహాలు జరిగాయి. తిరుప్పోరూర్లో కందస్వామి ఆలయంలో వంద జంటలకు వివాహాలు జరిగాయి. చైన్నె వడపళణి మురుగన్ ఆలయంతో పాటుగా అనేక ఆలయాలలో వివాహాలు జోరుగా జరిగాయి. కుటుంబాలతో సహా వచ్చి మురుగన్ సన్నిధిలలో కొత్త జంటలకు వివాహాలను పెద్దలు జరిపించారు. ఇదే విధంగా రాష్ట్రంలోని అనేక ఆలయాల వద్ద కొత్త జంటల వివాహాలు జరగడంతో కల్యాణ వైభోగమే అన్నట్టుగా మంగళకర వాతావరణం నెలకొంది.
భక్తిశ్రద్ధలతో కుంభాభిషేకాలు
డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం దేవాదాయ శాఖ పేరు మార్చింది. హిందూ మత దేవాదాయ శాఖగా పేరు మార్చి, నిత్యం భక్తితో కనిపించే శేఖర్బాబునుమంత్రిని చేశారు. ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ప్రగతి బాటలోకి తీసుకెళ్తూ వస్తున్నారు. పురాతన ఆలయాల పునరుద్దరణ,మరమ్మత్తుల ప్రక్రియను వేగవంతం చేశారు.ఈ నాలుగున్నర సంవత్సరాల డీఎంకే పాలనలో బుధవారంతో 4 వేల ఆలయాలకు కుంభాభిషేకాలు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఒక్క రోజున సుమారు ఆరేడు పురాతన, అతిపెద్ద ఆలయాలలో కుంభాభిషేకాలు జరిగాయి. మూహూర్తం రోజు కావడంతో వేకువ జామునుంచి ఆలయాలలో విశిష్ట పూజులు, యాగ శాలలో పూజలు జరిగాయి. మన్నార్కుడిలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన రాజగోపాల స్వామి ఆలయం, దక్షిణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కరూర్ జిల్లా తాంథోని మలై కల్యాణ వెంకటరమణ ఆలయం కుంభాభిషేకాలు జరిగాయి. మన్నార్కుడిలో జరిగిన వేడుకకు మంత్రి టీఆర్బీ రాజా హాజరయ్యారు. కల్యాణ వెంకటరమణ ఆలయంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు సంస్కృతితో పాటూ తమిళంలోనూ వేదపారాయణాలు జరిగాయి. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఎంపీ జ్యోతిమణి తదితరులు ఈకార్యక్రమానికి హాజరయ్యారు. విల్లుపురం జిల్లా అరసూరులో ప్రసిద్ధి చెందిన వారాహి అమ్మ వారి ఆలయంలో వైభవోపేతంగా కుంభాభిషేక మహోత్సవం జరిగింది. పుదుకోట్టై జిల్లా తిరువాపూర్ ముత్తుమారియమ్మన్ ఆలయంలోనూ బ్రహ్మాండ వేడుకగా కుంభాభిషేకం ఘట్టం జరిగింది. నామక్కల్ జిల్లా తిరుచంగోడులో ప్రసిద్ధి చెందిన ఓం కాళియమ్మన్ ఆలయంలోనూ భక్తిశ్రద్ధలతో కుంబాభిషేక ఘట్టం జరిగింది. ఓ కాళీ...జై కాళీ నామస్మరణ మార్మోగింది. ఇక, చైన్నె పెరంబూరులో ప్రసిద్ధి చెందిన సెమ్మాత్తమన్ ఆలయంలో కుంభాషేకం అత్యంత వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూ మత దేవాదాయ శాఖ మంత్రి శేఖర్బాబు, మేయర్ ప్రియ తదితరులు హాజరయ్యారు. ఈ ఆలయానికి జరిగిన కుంభాభి షేకంతో నాలుగున్నరేళ్ల కాలంలో నాలుగు వేల ఆలయాలకు విజయవంతంగా మహోత్సవాన్ని ముగించడం విశేషం.
4 వేల ఆలయాల్లో కుంభాభిషేకాలు
4 వేల ఆలయాల్లో కుంభాభిషేకాలు


