ఆగిన బ్యాంక్ సేవలు
– ఉద్యోగుల నిరసన పోరాటాలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో మంగళవారం బ్యాంక్ల సేవలు స్తంభించాయి. ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన పోరాటాలలో నిమగ్నమయ్యారు. వివరాలు.. బ్యాంక్లలోని ఉద్యోగులు గత కొంత కాలంగా తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు. ఈ డిమాండ్లతో పాటూ వారంలో 5 రోజుల పని విధానాన్ని ప్రవేశ పెటాలన్న డిమాండ్తో మంగళవారం ఒక రోజు సమ్మెకు పిలుపు నిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగంలోని వివిధ బ్యాంక్లకు చెందిన సుమారు 16 వేల శాఖలు స్తంభించాయి. ఉద్యోగులు విధులను బహిష్కరించి తమతమ ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినదించారు. చైన్నెలోని యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసనకు మహిళా ఉద్యోగులు సైతం దిగారు. పలుచోట్ల తమ తమ శాఖల వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. బ్యాంకులన్నీ మూత పడటంతో సేవలు స్తంభించాయి. ఇప్పటికే శుక్ర వారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజులు సెలవులతో బ్యాంక్ల లావాదేవీలు ఆగాయి. మంగళవారం సమ్మెతో పూర్తిగా సేవలు స్తంభించినట్టైంది. రాష్ట్రంలోని సుమారు 2 లక్షల మందికి పైగా సిబ్బంది విధుల్ని బహిష్కరించి తమ డిమాండ్ల సాధనకు నిరసనలలో పాల్గొన్నారు. వరుస సెలవులు, ఒక రోజు సమ్మె కారణంగా ఖాతా దారులకు అవస్థలు తప్పలేదు. డిజిటల్ లావాదేవిల నేపథ్యంలో నగదుకు డిమాండ్ అన్నది లేనప్పటికీ , ఇతర డిపాజిట్లు, చెక్కులు తదితర వ్యవహారాల సేవలు ఆగినట్లయ్యింది.


