జల్లికట్టు క్రీడాకారులకు రూ. 10 లక్షలు
సాక్షి, చైన్నె : జల్లికట్టు క్రీడలో ఎద్దుల దాడిలోమరణించే క్రీడా కారుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళణి స్వామి ప్రకటించారు. నామక్కల్లో మంగళవారం జల్లికట్టు సాహస క్రీడ ఉత్కంఠగా జరిగింది. తమిళుల వీరత్వాన్ని చాటే సాహస క్రీడ సంక్రాంతి సందర్భంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కొద్ది రోజుల పాటుగా వివిధ ఉత్సవాలలో జల్లికట్టు హోరెత్తించడం జరుగుతుంది. ఆదిశగా నామక్కల్ చల్లపాళయంలో జరిగిన జల్లి కట్టు పోటీలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జల్లికట్టు పూర్వీకులు అందించిన నైపుణ్యాల విద్య అని వ్యాఖ్యలు చేశారు. మన ఎద్దులను పరిరక్షించుకునే తంత్రంగా పేర్కొన్నారు. జల్లికట్టు క్రీడాకారులు తనకు అనేక సమస్యలు విన్నవించారని ప్రస్తావించారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే ఆ సమస్యలన్నీ పరిష్కరించ బడుతాయని వివరించారు. అలాగే ఎద్దుల దాడిలో మరణించే క్రీడాకారుడి కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. అలాగే జల్లికట్టు క్రీడాకారులు, ఎద్దులకు ప్రభుత్వమే బీమా చేయిస్తుందన్నారు. కాగా, ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఐదు వాగ్దానాలను పళణిస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జల్లికట్టు క్రీడాకారుల కోసం వాగ్దానం ప్రకటించడం విశేషం.


