సెన్సార్ బోర్డు, కేంద్రప్రభుత్వం ఆలోచించాలి
ప్రామిస్ చిత్ర ఆడియోను ఆవిష్కరించిన దర్శకుడు పేరరసు, కె.రాజన్ తదితరులతో యూనిట్ సభ్యులు
తమిళసినిమా: కోర్టు వరకూ వెళ్లినా జననాయకన్ చిత్ర విడుదల విషయంలో పరిష్కారం లేకపోవడం సబబు కాదని దర్శకుడు పేరరసు పేర్కొన్నారు. ప్రమాణం అనే అంశాన్ని ఇతి వృత్తంగా తీసుకుని ప్రామిస్ అనే చిత్రం రూపొందుతోంది. సంఘమిత్రన్ ప్రొడక్షన్స్, అమ్మన్ ఆర్ట్స్ క్రియేషన్స్ సంస్థలపై ఎన్.నాగరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అరుణ్కుమార్ శేఖరన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు పేరరసు, నటుడు, నిర్మాత కే.రాజన్, గిల్డ్ అద్యక్షుడు జాగ్వర్తంగం తదితరులు పాల్గొన్నారు. మందుగా చిత్ర నిర్మాత ఎన్.నాగరాజ్ మాట్లాడుతూ ఈ చిత్ర కథను చెప్పిన దర్శకుడు దీన్ని మీరే నిర్మించాలి అని చెప్పారన్నారు. తనకు కథ న చ్చినా, వెంటనే ఒకే చెప్పకుండా, తన భార్యతో సంప్రదించానన్నారు. ఆమె చేద్దామని చెప్పడంతో 2024 ఆగస్ట్ 15వ తేదీన పూజా కార్యక్రమాలతో షూటింగ్ను పూర్తి ప్రారంభించినట్లు చెప్పారు. మంచి ప్రతిభ కలిగిన దర్శకుడు కావడంతో ప్రామిస్ చిత్రాన్ని జనరంజకంగా తెరపై ఆవిష్కరించారని చెప్పారు. చిత్ర దర్శకుడు అరుణ్కుమార్ శేఖరన్ మాట్లాడుతూ ఇది భారీ బడ్జెట్ చిత్రం కాదని, తమకు ఎలాంటి నేపధ్య బలం లేదని, అలాంటిది తమను ప్రోత్సహించడానికి దర్శకుడు పేరరసు, కె.రాజన్, జాగ్వర్ తంగం వంటి ప్రముఖులు రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ప్రామిస్ అంటే ఇంతకు ముందు విలువ ఉండేదన్నారు. ఇప్పుడు అది కొందరిలో కనిపించడం లేదన్నారు. అయినా మంచి కథతో ప్రామిస్ అనే టైటిల్తో నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం పాటలు, ట్రైలర్ చూస్తే అనిపిస్తోందన్నారు. ఇకపోతే జననాయకన్ చిత్రం కోర్టు వరకు వెళ్లినా విడుదలకు పరిష్కారం లభించకపోవడం బాధాకరం అన్నారు. సెన్సార్కు వచ్చిన చిత్రానికి అభ్యంతకరమైన సన్నివేశాలు ఉంటే కట్స్ ఇవ్వాలని, వాటిని నిర్మాతల వర్గం అంగీకరించకపోతే రివైజింగ్ కమిటీకి పంపాలన్నారు. అలాంటిది కట్స్కు నిర్మాతల వర్గం అంగీకరించినా, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేయడం సెన్సార్బోర్డు సభ్యులకు, కేంద్రప్రభుత్వానికి సబబు కాదన్నారు. ఇది విజయ్ చిత్రానికి మాత్రమే సంబంధించిన విషయం కాదని, అన్ని చిత్రాలకు వర్తిస్తుందని పేరరసు పేర్కొన్నారు.
సెన్సార్ బోర్డు, కేంద్రప్రభుత్వం ఆలోచించాలి


