ఒకేసారి దర్శకులైన 34మంది
తమిళసినిమా: ప్రతిభను నిరూపించుకునే మాధ్యమం సినిమా. ఈ కలల ప్రపంచంలో తమ వినూత్న ఆలోచనలకు పదును పెట్టి సృజనాత్మక కథా చిత్రాలను తెరపై ఆవిష్కరించడానికి యువత ఉవ్విళ్లూరుతుంది. అందుకు శిక్షణ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతాయి. అలాంటి వారి ఆలోచనలకు పదును పెట్టే విధంగా ప్రముఖ చాయాగ్రాహకుడు, దర్శకుడు, రచయిత అంటూ పలు ముఖాలు కలిగిన చెళియన్ సినిమా పరిశ్రమకు భావితరాలను అందించే విధంగా ది ఫిలిం స్కూల్ పేరుతో ఇన్స్టిట్యూట్ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ది ఫిలిం స్కూల్లో శిక్షణ పొందిన 34 మంది విద్యార్థులు ఒకేసారి 34 చిత్రాలను తెరకెక్కించడం విశేషం. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇటీవల చైన్నెలో నిర్వహించారు. ఇది కచ్చితంగా తమిళ చిత్ర పరిశ్రమలో చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. ఈ కార్యక్రమంలో ఎడిటర్ బి.లెనిన్, శ్రీకర్ ప్రసాద్, చాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్, రవి వర్మన్, నిర్మాత జి ధనుంజయన్, దర్శకుడు ట్రాస్కీ మరుదు, జ్ఞాన రాజశేఖరన్, హరిహరన్ హాజరై చెళియన్ను అభినందించారు. చెళియన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ది ఫిలిం స్కూల్ ఇన్స్టిట్యూట్ ద్వారా దర్శకులుగా పరిచయం అవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.


