కోలాహలంగా ఆర్యవైశ్య మహిళా సభ కార్నివాల్
కొరుక్కుపేట: తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ –మద్రాస్ యూనిట్ 43వ వార్షిక కార్నివాల్ ఆదివారం స్థానిక ఆళ్వార్పేటలోని యతిరాజ హాలులో కోలాహలంగా జరిగింది. చైర్పర్సన్ సి.ప్రశాంతి సతీష్ వేడుకలను ప్రారంభించారు. కార్యదర్శి డి. భార్గవి అశోక్ వార్షిక నివేదికను చదివి వినిపించారు. చిన్నారులకు హరి అష్టకం, కృష్ణాష్టకం, చిత్రలేఖనం, సుందరకాండపై క్విజ్ తదితర పోటీలతో పాటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీఎస్ఆర్ ప్రాజెక్టు కింద తమిళనాడు ఆర్య వైశ్య మహిళా సభ సంయుక్తంగా ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.50 లక్షల విలువగల పరికరాలు, అదేవిధంగా ఎగ్మూర్ ప్రభుత్వ చిల్డ్రెన్స్ ఆస్పత్రికి రూ.లక్ష 8వేల విలువతో ట్రాన్ఫరెంట్ వెంటిలేటర్ను విరాళంగా అందజేశారు. కాంచీపురం యురేఖ ఆస్పత్రులకు మూడు ల్యాప్ ట్యాప్లను, మహిళల స్వయం సహాయ ఉపాధి పథకం కింద 17 కుట్టుమిషీన్లు, నాలుగేళ్ల క్యాన్సర్ బాధిత చిన్నారికి వైద్య చికిత్సల కోసం రూ.30 వేలు వితరణ చేశారు. కార్నివాల్లో భాగంగా సంస్థకు చెందిన 15 మంది మహిళలు రెట్రో వాక్ పేరిట అలనాటి సినీ నటీమణులు సావిత్రి, కాంచన, వాణిశ్రీ, వైజయంతి మాల, వహిదారెహ్మాన్, బి. సరోజాదేవి, పద్మిని, రాగిని తదితర నటీమణుల వేషధారణలో వారి నటించిన సినిమాల్లోని పాటలకు హావాభావాలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. నగరంలోని పలు తెలుగు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అదేవిధంగా హౌస్ఏస్, క్విజ్ తదితర పోటీల్లో సత్తాచాటిన విజేతలకు ముఖ్య అతిథి గీతాంజలి బహుమతులు అందజేశారు.


