రంగంలోకి సౌమ్య అన్బుమణి
సాక్షి, చైన్నె: పీఎంకేలో వివాదాల నేపథ్యంలో తన భర్తకు మద్దతుగా రాజకీయ వ్యవహారాలపై సౌమ్య అన్బుమణి దృష్టి పెట్టారు. శనివారం చైన్నె శివారులోని ఉద్దండిలో పీఎంకే, వన్నియర్ సంఘాల మహిళా నేతలతో సమావేశమయ్యారు. పీఎంకేలో వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. రెండు గ్రూపులుగా విడి పోయి పీఎంకే కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అదే సమయంలో అన్బుమణిని పార్టీ నిర్వాహక అధ్యక్షుడి పదవి నుంచి రాందాసు తప్పించారు. ఆయన స్థానంలో తన పెద్దకుమార్తె శ్రీగాంధిని రంగంలోకి దించారు. ఈమె పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్లడమే కాకుండా, మహిళల్ని ఆకర్షించే విధంగా సభలు, సమావేశాలలో బిజీగా ఉన్నారు.ఈ పరిస్థితులలో అన్బుమణి శిబిరానికి మద్దతుగా ఆయన సతీమణి సౌమ్య అన్భుమణి రంగంలోకి దిగారు. గత లోక్ సభ ఎన్నికలలో ధర్మపురి నుంచి పోటీచేసి స్వల్ప ఓట్లతో సౌమ్య ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆమెకు రాజకీయాలు కొత్తమే కాదు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తండ్రి కృష్ణ స్వామి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కాగా, ఆమె సోదరుడు విష్ణు ప్రసాద్ ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. తాజాగా పీఎంకే వివాద రాజకీయాలలో భర్తకు వెన్నంటి నిలిచే విధంగా అడుగులు వేశారు. చైన్నె శివారులోని ఉద్దండిలో శనివారం పీఎంకే, వన్నియర్ సంఘాల మహిళా నేతలతో సమావేశమయ్యారు. 2026 ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసందర్భంగా మహిళా నేతలకు ఆమె పిలుపు నిచ్చారు.


