
● పదవి నుంచి తొలగింపు ● పళణి నిర్ణయం ● సెంగోట్టయన్ మద్
సాక్షి, చైన్నె: సెంగోట్టయన్ వెన్నంటి కదిలిన మాజీ ఎంపీ సత్యభామను పార్టీ నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నిర్ణయం తీసుకున్నారు. దీంతో సెంగోట్టయన్ మద్దతు దారులంతా అన్నాడీఎంకేకు రాజీనామా చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో అసంతృప్తి నాయకులు, బహిష్కృత నేతలను ఏకం చేసే దిశగా సెంగోట్టయన్ వ్యూహాలకు పదును పెట్టారు. అందర్నీ ఒకే వేదికపై తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వివరాలు.. ఐక్యత, సమష్టి, సమన్వయం అంటూ పార్టీ నుంచి బహిష్కరించబడ్డ వాళ్లు, బయటకు వెళ్లిన వాళ్లందర్నీ మళ్లీ ఏకం చేయాలంటూ మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోట్టయన్ ఇచ్చిన పిలుపు పార్టీలోనే కాదు.. రాజకీయంగానూ చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కన్నెర్ర చేశారు. ఆయన్ని పార్టీ పదవుల నుంచి తప్పించారు. అదే సమయంలో ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి సాగనంపే విధంగా చర్యలు చేపట్టారు. ఈపరిస్థితులలో సెంగోట్టయన్ వెన్నంటి కదలిన మాజీ ఎంపీ, తిరుచ్చి మాజీ మేయర్ సత్య భామపై సైతం పళణిస్వామి కన్నెర్ర చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు, ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా మహిళా విభాగం కార్యదర్శి పదవుల నుంచి వీ. సత్యభామను ఆదివారం తప్పించారు. సత్యభామ తదుపరి మరి కొందర్ని తప్పించే ందుకు పళణి నిర్ణయించిన సమాచారంతో సెంగోట్టయన్ మద్దతు దారులు అప్రమత్తమయ్యారు. తామే పదవులకు రాజీనామా చేస్తున్నామని ప్రకటిస్తూ , పార్టీ కార్యాలయానికి లేఖలు పంపించే పనిలో నిమగ్నం కావడం గమనార్హం.
అసంతృప్తి నేతలతో..
పళణి స్వామి పార్టీలో నియంత వలే వ్యవహరిస్తుండడంపై సెంగోట్టయన్ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. దీంతో పార్టీలో అసంతృప్తితో ఉన్న ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కొంగు మండలంలో బలమైన నేతగా ఉన్న సెంగోట్టయన్ ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల అభిప్రాయాలను సేకరిస్తూ వస్తున్నట్టు సమాచారం. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ మంత్రులు పళణి నిర్ణయానికి వ్యతిరేకత వ్యక్తంచేసినట్టు తెలిసింది. అదే సమయంలో అసంతృప్తితో ఉన్న ముఖ్య నేతలందరూ ఒక్క సారిగా పళణి నిర్ణయాన్ని ధిక్కరించే దిశగా వ్యూహ రచనలో ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈనెల 9న ఈరోడ్లో ఓ సమావేశానికి సైతం సెంగోట్టయన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారాలు వెలువడటం గమనార్హం. ఆ తదుపరి చిన్నమ్మ శశికళను సెంగోట్టయన్ కలిసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.
సత్యభామ వంతు!
సెంగోట్టయను కలుస్తా..
సెంగోట్టయన్ను తాను కలవబోతున్నట్టు మాజీ సీఎం పన్నీరు సెల్వం ప్రకటించారు. అందర్నీ సమన్వయ పరిచే విధంగా సెంగోట్టయన్ చేపట్టే ప్రయత్నాలకు తన మద్దతు ఎల్లప్పుడు ఉంటుందన్నారు. ఆయన్ని కలిసి మరిన్ని విషయాలు మాట్లాడుతానని పేర్కొన్నారు. ఇక, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం టీటీవీ దినకరన్ సైతం సెంగోట్టయన్కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ దృష్ట్యా, మరికొద్ది రోజులలో శశికళ, పన్నీరు, సెంగోట్టయన్, దినకరన్తో పాటూ అసంతృప్తితో ఉన్న ముఖ్య నేతలందరూ ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు అనుగుణంగా దక్షిణ తమిళనాడులో పలు చోట్ల శశికళ, పన్నీరు, సెంగోట్టయన్, దినకరన్ చిత్ర పటాలతో పన్నీరు మద్దతు దారుడైన ఆశై తంబి పేరిట పోస్టర్లు హోరెత్తడం గమనార్హం. కాగా పార్టీకి , తనకు వ్యతిరేకంగా వ్యవహరించే ఏ ఒక్కర్నీ ఉపేక్షించబోనన్నట్టుగా పళణిస్వామి మరింత దూకుడు ప్రదర్శించనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తనకు ప్రజాదారణ పెరిగినట్టు గ్రహించిన ఆయన ఇక, ఎవరైనా సరే వ్యతిరేక గళం అందుకుంటే వేటు పడుద్ది అన్నట్టుగా ముందడుగు వేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు అనుగుణంగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు వాళ్లు కాదని, వారంతా పార్టీ నుంచి బహిష్కరించబడ్డ వారని, వారిని మళ్లీ అక్కున చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

● పదవి నుంచి తొలగింపు ● పళణి నిర్ణయం ● సెంగోట్టయన్ మద్