భానుపురి (సూర్యాపేట) : వచ్చే నాలుగు రోజుల పాటు జిల్లావ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభలకు మండలాల వారీగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. జిల్లాలో నిర్వహించే గ్రామ సభలు, శానిటేషన్, తాగునీరు, సీజనల్ వ్యాధుల నివారణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల సవరణలపై మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు 72శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాను 3వ స్థానంలో నిలిపినందుకు వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్బృందాలు నిఘా పెట్టాలన్నారు. వర్షపాతం తక్కువగా నమోదైతే ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. వన మహోత్సవానికి అటవీ శాఖ, డీఆర్డీఏ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకోవాలని తెలిపారు. వారం రోజుల్లోగా సమగ్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) పై అధికారులందరికీ పూర్తి అవగాహన ఉండాలన్నారు. గ్రామ సభలు, వార్డు సభలు ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఎస్పీ నరసింహ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ శిరీష, డీఎఫ్ఓ దామోదర్ రెడ్డి, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సీపీఓ కిషన్, జిల్లా ఫైర్ అధికారి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


