చివ్వెంల : మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత అన్నారు. గృహహింస, వరకట్న మరణాలపై శనివారం చివ్వెంల మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో మహిళలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేయాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, డీఎల్ఎస్ఏ నామినేటెడ్ సభ్యులు మధు, మమత, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎస్ఐ కనకరత్నం పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ స్టవ్ల విక్రేతల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ అశోక్ శనివారం ఒక తెలిపారు. జిల్లాలో ఎంపిక చేయబడిన 140 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేయుటకు గ్యాస్ స్టవ్లను (సుమారు 50 కేజీల అన్నం, కూరగాయలు వండేందుకు ఇనుప గ్యాస్ పొయ్యి) సరఫరాకు ఆసక్తి గల సరఫరాదారులు తమ కొటేషన్లను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఈ నెల 10వ తేదీలోపు సమర్పించాలని కోరారు.
గోదావరి జలాల నిలిపివేత
అర్వపల్లి : యాసంగి సీజన్కుగాను జిల్లాకు ఆరు విడతలుగా వదిలిన గోదావరి జలాలను నిలిపివేశారు. చివరి విడతగా పది రోజుల నుంచి నీటిని వదిలిన అధికారులు శుక్రవారం రాత్రి బంద్ చేశారు. వరిచేలు 15 రోజుల్లో చేతికందే అవకాశం ఉన్నందున మరో విడత నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.
ఓటర్ సవరణపై శిక్షణ ఇస్తాం
భానుపురి (సూర్యాపేట) : ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ కార్యక్రమంపై సిబ్బందికి శిక్షణ ఇస్తామని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సూర్యనారాయణ, వేణుమాధవరావు, శ్రీనివా సులు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సంతోష్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
శాంతి నెలకొల్పాలి
సూర్యాపేట అర్బన్ : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చేస్తున్న యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు జిల్లా యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో యుద్ధం వద్దు–ప్రపంచ శాంతి కావాలి. డౌన్ డౌన్ ట్రంప్, మోదీ అంటూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి, భద్రత మండలి జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, డీటీఎఫ్ నాయకులు లింగయ్య, సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ ఎల్.భద్రయ్య, టీపీటీఎఫ్ నేత వీరన్న, ముస్లిం మైనార్టీ నాయకులు కాలే హమ్మద్, అబ్దుల్లా, ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


