సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని రవి మహాల్లో సూర్యాపేట ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోమనాథ్ మూలవిరాట్ జ్యోతిర్లింగాన్ని గురువారం పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి, భారతదేశంలోని జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని గజని మహ్మద్ ధ్వంసం చేసిన తరువాత అందులోని మూలవిరాట్ జ్యోతిర్లింగాన్ని అగ్నిహోత్రి బ్రాహ్మణులు గోప్యంగా దాచి నేటి వరకు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ మూలవిరాట్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే అవకాశాన్ని సూర్యాపేట పట్టణ ప్రజలకు బ్రహ్మర్షి రిషి దేవవ్రత్జీ, సూర్యాపేట ఆర్ట్ ఆఫ్ లివింగ్ కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, చలమల్ల నరసింహ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు వంగవీటి రమేష్, బుద్ధ భిక్షపతి, సందీప్, బాణాల శ్రీనివాస్, రాధాకృష్ణ, నరేందర్ భరద్వాజ్, నాగరాజు పాల్గొన్నారు.


