నాలుగేళ్లలో అప్రతిష్టపాలు చేశారు
హయత్నగర్ : రైతులకు బిల్లులు చెల్లించడం, బ్యాంకు రుణాలు తీర్చడం, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంలో పాలకమండలి విఫలమైందని నల్లగొండ–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (నార్ముల్) మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి అన్నారు. పాలక మండలిలో జరుగుతున్న పరిణామాలపై చర్చించి పాలక వర్గాన్ని రద్దు చేసేందుకు అనుగుణంగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ఆయన ఆధ్వరంలో గ్రామస్థాయి చైర్మన్లు మదర్ డెయిరీ ఎండీ అబ్దుల్ గఫార్కు నోటీసు అందించారు. అనంతరం జితేందర్రెడ్డి మాట్లాడుతూ.. నాలుగేళ్లలో డెయిరీని అప్రతిష్టపాలు చేశారని మండిపడ్డారు. ఆర్టికల్ 19 ప్రకారం నోటీసు అందుకున్న నెల రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలని, లేకుంటే పాలక మండలి రద్దవుతుందన్నారు. తాను చైర్మన్గా ఉన్నప్పుడు వచ్చిన లాభాలతో స్థిరాస్తులు కొన్నామని, కేవలం రూ.13 కోట్లు మాత్రమే బ్యాంకుల నుంచి ఓడీలు తీసుకున్నామని చెప్పారు. ఆదాయం అధికంగా చూపి ఆదాయ పన్ను చెల్లించామనడం అసత్యమని, స్థిరంగా వచ్చే ఆదాయానికి మాత్రమే పన్ను చెల్లించామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో మార్కెటింగ్ సరిగ్గా లేక బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
వేతనాల కోసం రోడ్డెక్కిన ఉద్యోగులు
మూడు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని మదర్ డెయిరీ ఉద్యోగులు సోమవారం పాలకమండలి భవనం ఎదుట ఆందోళనకు దిగారు. ఏడాదిగా సరైన సమయంలో జీతాలు ఇవ్వడం లేదని, ఈపీఎఫ్ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవరమైతే మార్కెటింగ్ చేసేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని, అనవసర ఖర్చులు తగ్గించి ఉద్యోగులకు వెంటనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చైర్మన్ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ఎంతకీ ఆయన రాకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందించారు.
మదర్ డెయిరీ మాజీ చైర్మన్
గుత్తా జితేందర్రెడ్డి


